ఆదిమానవ సమాజం నుంచి మార్పులు చెందుతూ, చంద్రునిపైకి వెళ్లి వచ్చేంత టెక్నాలజీ సాధించాం. ఇంత టెక్నాలజీ సాధించిన మనదేశంలో ఆడపిల్లలపై ఉండే వివక్ష మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆడపిల్ల పుట్టిందంటే ముఖం చాటేసే కుటుంబాలు కోకొల్లలు. ఆడపిల్ల లేకుంటే మానవ మనుగడ సాధ్యం అవునా. అలాంటి ఆడశిశువులను ఇప్పుడు పురిటిలోనే చిదిమేస్తున్నారు. వారి జననాల రేటు తగ్గించడం, మనం కూర్చున్న కొమ్మను మనమే కొట్టుకున్నట్లు అవుతుంది. వివరాల్లోకి వెళితే
గత నాలుగేళ్లుగా దేశంలో బాలికల జననాల రేటు క్రమంగా తగ్గిపోతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రతి వెయ్యి మంది మగ శిశు జననాలకు, ఆడశిశువుల జననాలు 900 లోపే ఉంటుందని తాజాగా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ఫర్ 2019 నివేదికలో పేర్కొన్నది. 2019 ఏడాదికి సంబంధించి సెక్స్ రేషియో ఎటు బర్త్ ( ఎస్ ఆర్ బి) అంశంలో నమోదైన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయని సామాజిక నిపుణులు అంటున్నారు. దాదాపు అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో లింగ నిష్పత్తి తేడా గణనీయంగా పెరిగింది. 2018, 2017 సంవత్సరాలతో పోలిస్తే గణాంకాలు ఎక్కువగా దిగజారాయి అని తేలింది. సహజంగా గిరిజనులు ఎక్కువగా జీవించే రాష్ట్రాలు లింగ నిష్పత్తిలో మెరుగైన గణాంకాలు నమోదు చేస్తాయి. అట్లాంటిది చత్తీస్గడ్ ఎస్ ఆర్ బి 968 నుంచి (2017లో ) 931 కి(2019లో ) పడిపోయిందని తెలిపింది.
తెలంగాణలో మాత్రం ఎస్ ఆర్ బి 915 నుంచి 953, ఉత్తరాఖండ్లో 929 నుంచి 960 కి పెరిగింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, దేశంలో ఎస్ ఆర్ బి 952 దాటిన రాష్ట్రాలు ఆరు ఉండగా అందులో మూడు ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. కేరళలో ఎస్ ఆర్ బి 960, మిజోరంలో 975, నాగాలాండ్ లో 1001, అరుణాచల్ ప్రదేశ్ లో 1024 గా ఉంది. ఇందులో అరుణాచల్ ప్రదేశ్ దేశంలోనే అత్యధికంగా ఉన్నది. జనన వివరాలు సరిగా నమోదు చేయకపోవడం, ఆలస్యం చేయడం కారణంగా బీహార్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల, లెక్కల్ని సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం ఫర్ 2019లో పొందుపరచలేదని తెలిసింది...