
హెటిరో సంస్థలో ఐటీ అధికారులు కొద్దిరోజులుగా సోదాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తోంది. 550 కోట్ల రూపాయలను నల్లధనంగా గుర్తించారు. 142 కోట్ల రూపాయలను జప్తు చేశారు. 6 రాష్ట్రాల్లోని హెటిరో సంస్ధల్లో 60 చోట్ల నాలుగు రోజులపాటు ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు జరిపారు. వందల కొద్దీ అట్టపెట్టెల్లో నగదును భద్రపరచడాన్ని అధికారులు గుర్తించారు. బీరువాల నిండా రూ.500 నోట్ల కట్టలు కట్టలు కట్టలుగా పేర్చి ఉన్నాయి. ఆ నోట్ల కట్టలను ఇనుప బీరువాలో ఉంచారు. ఆ బీరువాలను అధికారులు జప్తు చేశారు. చిన్న చిన్న అపార్ట్మెంట్లలో ప్లాట్లను కొని ఆ డబ్బు దాచినట్టు ఆదాయపు పన్నుశాఖ అధికారులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మెడిసిన్ నిల్వ పేరుతో అట్టపెట్టెల్లో రూ.142 కోట్లు దాచారని, ఇనుప అల్మారాల్లో డబ్బును కుక్కిపెట్టారని, ఒక్కో అల్మారాలో 5 కోట్ల రూపాయల నగదును దాచిపెట్టినట్లు తెలిపారు. ఆ డబ్బు లెక్క పెట్టేందుకే రెండు రోజుల సమయం తీసుకున్నారు. పెద్ద సంఖ్యలో లాకర్లను గుర్తించారు. వాటిని కూడా తెరిచి ఏమేం దాచారో పరిశీలిస్తున్నారు.