
రెండు తెలుగురాష్ట్రాల మధ్య మొదలైన జలవనరుల వివాదం పరిష్కారంపై కేంద్రప్రభుత్వం చేతులెత్తేసింది. రెండు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులు, నిర్మాణం జరగాల్సిన ప్రాజెక్టులతో పాటు నీటివాట, విద్యుత్ ఉత్పత్తి తదితరాలపై పెద్ద వివాదాలే నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వివాదం పరిష్కారానికి ఎన్నిసార్లు రెండు రాష్ట్రాల్లోని ఉన్నతాధికారుల మధ్య భేటిలు జరిగినా సయోధ్యం జరగలేదు. దాంతో చివరకు సమస్య పరిష్కార బాధ్యత కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖపైన పడింది. దాంతో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన ఎపెక్స్ సమావేశం ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. ఈ నేపధ్యంలోనే కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. కిషన్ చేసిన కామెంట్లు చూస్తే సమస్య పరిష్కారం అవ్వటం కేంద్రానికి ఇష్టం లేదన్న విషయం అర్ధమైపోయింది.
తెలంగాణాలో నిర్మాణం జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ లాంటి అనేక సమస్యలపై వివాదం పెరిగిపోతోంది. ఇదే సమయంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీం ఎత్తు పెంచటం, కొత్తగా నిర్మాణం చేయాలని అనుకుంటున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం తదితరాలపై పెద్ద వివాదమే మొదలైపోయింది. ఈనెల 6వ తేదీన జరగబోయే ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన విషయాలపై రెండు ప్రభుత్వాలు పూర్తిస్ధాయిలో రెడీ అయ్యాయి. ఈ నేపధ్యంలోనే కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచింది. రెండు రాష్ట్రాల మద్య సమస్య పరిష్కారం చేయాల్సిన కేంద్రం రాజకీయ కోణం కూడా ఆలోచిస్తోంది. ఇక్కడే కేంద్రం ఆలోచనేంటో అందరికీ అర్ధమైపోయింది.
కిషన్ మాట్లాడుతూ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చుని సమస్యను పరిష్కారం చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు. ఇద్దరు సిఎంలు కూర్చుని దావత్ లు ఇచ్చిపుచ్చుకుంటారు, పండగలకు హాజరవుతారు, కలిసి విందులు చేసుకుంటారంటూ కిషన్ అర్ధంలేని వ్యాఖ్యలు చేశాడు. సిఎంల మధ్య ఇంత సాన్నిహిత్యం ఉన్నపుడు సమస్యల పరిష్కారం మాత్రం ఎందుకు చేసుకోలేకపోతున్నారంటూ ఆరోపించటమే విచిత్రంగా ఉంది. జలవివాదాలు సంవత్సరాలపాటు కంటిన్యు అవటంలో కేంద్రం తప్పేమీ లేదని కూడా చెప్పాడు. కిషన్ వాదన ప్రకారం తప్పంతా రాష్ట్రాలదే అన్నట్లుగా ఉంది. సమస్య పరిష్కారం రెండు రాష్ట్రాల మధ్య సాధ్యం కానపుడే కదా పెద్దన్న తరహాలో కేంద్రం జోక్యం చేసుకోవాల్సింది. మరి తన మధ్యవర్తిత్వం నుండి కేంద్రం పారిపోతే సమస్య పరిష్కారం ఎలాగవుతుంది ?
కిషన్ రెడ్డి మాటలు విన్న తర్వాత ఓ విషయం స్పష్టమైపోయింది. సమస్య పరిష్కారం కేంద్రానికి ఇష్టం లేదని. ఎందుకంటే సమస్య సమస్యగా ఉంటేనే రాష్ట్రప్రభుత్వాలు కేంద్రంవైపు చూస్తాయి. లేకపోతే కేంద్రాన్ని ఎవరు లేక్కచేయరని కిషన్ అనుకుంటున్నట్లుంది. పైగా రెండు రాష్ట్రాల్లోను బీజేపి ఎదగాలని కోరుకుంటోంది. తెలంగాణాలో ఉపఎన్నిక జరుగుతోంది. ఏపిలో కూడా నోటిఫికేష్ వస్తుంది. ఇటువంటి సమయంలో సమస్య పరిష్కారం విషయంలో ఏదో ఓ రాష్ట్రానిదే న్యాయం అని చెబితే రెండో రాష్ట్రంలో పరిస్దితులు భగ్గుమంటాయి. అది బీజేపికి ఇబ్బందిగా మారుతాయి. అందుకనే సమస్య పరిష్కారంలో కేంద్రం చేసేదేమీ లేదని కిషన్ చెప్పేశాడు. అంటే సమస్య పరిష్కారంలో కేంద్రం చేతులెత్తేసినట్లే అర్దమైపోతోంది.