
కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవాలంటే రోగనిరోధకశక్తిని పెంచుకోవడం ఒక్కటే మార్గం. ప్రతిరోజు ఏయే పదార్థాలు తీసుకుంటే ఏయే ప్రయోజనాలు అందుతాయో పరిశీలిద్దాం!
వెల్లుల్లి : కూరల్లో, పచ్చళ్లలో వచ్చే వెల్లుల్లి రెబ్బలను చాలామంది తినరు. ఇలా చేస్తే ఆరోగ్యాన్నీ వదిలేసినట్లే. వెల్లుల్లి యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. జీర్ణాశయంలో ఏర్పడే పుండ్లు, క్యాన్సర్కు కారణమయ్యే కణాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
బాదం : ఇది వ్యాధినిరోధక శక్తి తగ్గకుండా కాపాడుతుంది. బాదంలో బి విటమిన్లు ఒత్తిడి, ఆందోళన వంటి ప్రభావాల నుంచి బయటపడడానికి సహాయపడతాయి. బాదంలో విటమిన్ ఇ సమృద్ధిగా లభిస్తుంది.
స్వీట్ పొటాటో : చిలకడదుంప, గెనిసి గడ్డ, రత్నపురి గడ్డగా పిలిచే దీంట్లో బీటా కెరోటిన్లు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాల నుంచి ఎదురయ్యే అనర్థాలను తొలగిస్తాయి. వృద్ధాప్య ఛాయలను తగ్గించే విటమిన్ 'ఎ' దండిగా ఉంటుంది.
పెరుగు : రోజూ కప్పు పెరుగు తింటే తరచూ జలుబు బారినపడే అవకాశాలు తగ్గుతాయి. జబ్బులతో పోరాడేందుకు రోగనిరోధకశక్తిని ప్రేరేపిస్తుందని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది. ఇందులో విటమిన్ డి ఉంటుంది. ఇది జలుబు, ఫ్లూ వంటి సమస్యను నివారిస్తుంది.
పాలకూర : ఇందులో ఫొలేట్ దండిగా ఉంటుంది. పాలకూరలో పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. ఇది శరీరంలో కొత్త కణాల ఉత్పత్తిలో పాలుపంచుకుంటుంది.
పుచ్చకాయ : నోరూరించే పుచ్చకాయలో గ్లూటాథియోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లు, జబ్బుల బారిన పడకుండా కాపాడుతుంది.
మాంసాహారం : స్కిన్ చికెన్, చేపలు, గుడ్డులో తెల్లసొన వంటి వాటిలో ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇవే కాకుండా సిట్రస్ జాతి పండ్లు నిమ్మకాయ, ఆరెంజ్, కాలీఫ్లవర్, క్యారెట్, పుట్టగొడుగులు, ఓట్స్, ఉల్లిగడ్డలు, పసుపు వంటి ఆహార పదార్థాలూ మన శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచడానికి సహాయపడతాయి.