రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట ట్రెండ్ సెట్ చేసిన నువ్వే కావాలి సినిమా గురించి ఆ సినిమా నిర్మాత‌ల‌లో ఒక‌రు స్ర‌వంతి ర‌వికిషోర్ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు. మలయాళంలో విడుదలైన “నీరమ్” అనే సినిమా ఆయన దృష్టిని ఆకర్షించింది. ఆ కథలో ఉన్న భావోద్వేగం, సహజత్వం చూసి ఇదే కథను తెలుగులో తీయాలి అనే ఆలోచన వచ్చింది. ఆ రీమేక్‌ను విజయభాస్కర్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించారు. ద‌ర్శ‌కుడు విజయభాస్కర్‌తో ఆయనకు అప్పటికే స్నేహం ఉంది. ఇద్దరూ కలిసి సీరియల్స్ చేసే ప్రయత్నం కూడా చేసినట్టు రవి కిషోర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేరడంతో క‌థ మ‌రింత బాగా కుదిరింది. ఆ సమయంలో అందరూ తమ కెరీర్ ప్రారంభ దశలో ఉన్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు. అప్పుడు ఈటీవీ బాపినీడు, రామోజీరావు గారు ఇచ్చిన సహకారం వారికి వెన్నుదన్నుగా నిలిచింది.


నువ్వే కావాలి సినిమా మొదట హైదరాబాద్‌లో మూడు థియేటర్లలో మాత్రమే విడుదలైంది. ఓడియన్, దిల్‌షుక్‌నగర్, కుకట్‌పల్లి. ఓడియన్ థియేటర్‌కి అప్పట్లో బ్యాడ్ రిపోర్ట్ ఉండేద‌ట‌. రవి కిషోర్ స్వయంగా థియేటర్ సౌండ్ సిస్టమ్ మార్చి, సదుపాయాలను మెరుగుపరిచారు. మొదటి ఇర‌వై రోజులు చాలా స్లోగా స్టార్ట్ అయిన ఈ సినిమా, మెల్లగా వర్డ్ ఆఫ్ మౌత్‌తో బలమైన పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత ఆ సినిమా తిరుగులేని బ్లాక్‌బస్టర్‌గా మారింది.


మ్యూజిక్ డైరెక్టర్ కే. సీతారామశాస్త్రి అందించిన పాటలు సినిమాకు ప్రాణం పోశాయి. రామోజీరావు ప్రొడక్షన్‌కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఎక్కడా జోక్యం చేసుకోలేదని రవి కిషోర్ చెప్పారు. రూ.1.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల పరంగా మాత్రమే కాకుండా, ప్రేక్షకాదరణ పరంగా కూడా రికార్డులు సృష్టించింది. సుమారు మూడు కోట్ల మంది ఈ సినిమాను చూశారని అంచనా. వందో రోజు నాటికి ఓడియన్ కాంప్లెక్స్‌లోని అన్ని థియేటర్లలో ఈ సినిమానే ప్రదర్శించడం ఆ సమయంలో విశేషంగా నిలిచింది. ప్రేక్షకుల ఉత్సాహంతో థియేటర్లలో అద్దాలు పగిలాయ‌ని ర‌వి కిషోర్ తెలిపారు. “ నువ్వే కావాలి ” తర్వాత యూత్ సినిమాల శైలిలో కొత్త ధోరణి మొదలైందని రవి కిషోర్ గుర్తుచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: