బీజేపీ ప్రముఖుడు ఒకరు చేసిన చర్య ఊహించిన వివాదం సృష్టించింది. ప్రముఖ జర్నలిస్టు, ఎడిటర్స్ గిల్డ్ మాజీ అధ్యక్షుడు రాజ్దీప్ సర్దేశాయ్ ‘ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థకు ప్రతినిధిగా ఉండాలా?’ అంటూ బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ ఆన్లైన్ పోల్ నిర్వహించారు. దీనిపై ఎడిటర్స్ గిల్డ్ శనివారం తీవ్రంగా మండిపడింది. వెంటనే ఈ పోల్ను ఉపసంహరించుకోవాలని, మాలవీయను గట్టిగా హెచ్చరించాలని బీజేపీని డిమాండ్ చేసింది. మాలవీయ శుక్రవారం ట్విట్టర్లో ఈ పోల్ నిర్వహించగా, ఈ చర్య అత్యంత గర్హనీయమైనదిగా ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది.
బీజేపీ ఐటీ సెల్ అధ్యక్షుడు అమిత్ మాలవీయ తీరును గర్హిస్తూ ఓ ప్రకటన విడుదల చేచసింది. ‘ట్విట్టర్లో చేపట్టిన ఈ పోల్ అభ్యంతరకరమైనది. సీనియర్ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ సమగ్రతను, దేశభక్తిని ప్రశ్నించేలా ఉన్నది’ అని ఓ ప్రకటనలో చెప్పింది. అసమ్మతి గళాలను అవమానించకుండా, ఆరోగ్యకరమైన చర్చలను ఆహ్వానించే విషయంలో బీజేపీ వైఖరిని ప్రశ్నించింది. కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ సైతం మాలవీయ చర్యను ఖండించారు. తనకు లభించిన మద్దతు పట్ల రాజ్దీప్ సంతోషం వ్యక్తం చేశారు. మాలవీయపై తాను ఎలాంటి ద్వేషం పెంచుకోనని ఓ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, కొద్దికాలంగా రాజ్దీప్ సర్దేశాయ్ ప్రధాని నరేంద్రమోదీ మొదలుకొని పలువురు ముఖ్యమంత్రుల వరకు తనదైన శైలిలో ఘాటుగా ప్రశ్నిస్తున్నారు. దేశంలో ఎంతోమంది నాయకులు మీడియా ముందుకు వచ్చేందుకు జంకుతున్నారని, జర్నలిస్టుల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం లేకనే వారంతా మీడియాకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు. సోషల్ మీడియా రాకతో ప్రతిఒక్కరూ జర్నలిస్టులుగా మారిపోయి అసత్యవార్తలతో సమాజాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో దేశ సమగ్రతను కాపాడటం జర్నలిస్టులకు పెద్ద సవాల్గా మారిందని రాజ్దీప్ అభిప్రాయపడ్డారు. బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ వల్ల టీవీ చానళ్లు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయని, వాటితో పోల్చితే పత్రికలకే ఎక్కువ విశ్వాసం ఉన్నదని స్పష్టంచేశారు.