అప్పట్లో సంచలనం సృష్టించిన ఓటుకి నోటు కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ ఏపీలో రాజకీయాలు వాడి వేడిగా ఉన్న సమయంలో ఓటుకి నోటు కేసు తెరమీదకు రావడంతో తెలంగాణ ఏపీలో ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో రేవంత్ రెడ్డి, చంద్రబాబు తదితరులు ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డి ఆంగ్లో ఇండియన్, ఎమ్యెల్సీ స్టీఫెన్ సన్ కు డబ్బులు ఇవ్వడం, ఈ వ్యవహారం గురించి చంద్రబాబు స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఫోన్ సంభాషణ ఇవన్నీ ఆధారాలతో సహా బయటపడ్డాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి మంగళవారం ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు కోర్టుకు హాజరుకావాల్సి ఉంది. 


ఈ కేసులో ఏ1 గా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్నారు. ఆయనను రేపు ఏసీబీ కోర్టుకు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అనేక కీలక ఆధారాలు సంపాదించింది. మొత్తం 960 పేజీలతో చార్జిషీట్‌ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో నిందితుల పాత్ర, అసలు సూత్ర దారులకు సంబంధించి కీలక విషయాలను పొందుపరిచారు. అంతే కాకుండా ఈ కేసుకి సంబంధించి కీలకంగా ఉన్న ఆడియో టేపులు ఎఫ్ ఎస్ ఎల్ రిపోర్ట్ కూడా కోర్టు కి చేరింది. ఈ కేసులో స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి ఇవ్వాలనుకున్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది అత్యంత కీలకంగా మారింది. 


త్వరలోనే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. అయితే 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్‌ రెడ్డిని గెలిపించుకునేందుకు నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను ప్రలోభ పెట్టేందుకు రూ. 50 లక్షలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ దొరికిపోయారు. ఇప్పుడు మరోసారి ఈ కేసు తెరమీదకు రావడంతో చంద్రబాబుతో పాటు రేవంత్ అనుచరుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: