ఎంసీహెజ్ జీహెచ్ఎంసీగా మారిన తర్వాత గ్రేటర్ ఏర్పాటైన రెండేళ్లకు 2009లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 2009 నుంచి 2014 వరకు పాలకమండలి కొనసాగింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏడాదిన్నరకు అంటే 2016 ఫిబ్రవరి 2వ తేదీన బల్దియాకి చివరి సారిగా ఎన్నికలు జరిగాయి. 2016 ఫిబ్రవరి 11న ఎంపికైన పాలక మండలి ప్రస్తుతం అధికారంలో ఉంది. వీరి పదవీ కాలం ఫిబ్రవరి 10, 2021 వరకు ఉంది. అయితే అంతకు ముందుగానే బల్దియాకు ఎన్నికలు జరుగుతున్నాయి. బల్దియాలో ప్రస్తుతం 8వ సారి జరుగుతున్న ఎన్నికలివి.
అంతకు ముందు హైదరాబాద్ చరిత్రను ఓసారి పరిశీలిస్తే.. 1948 సెప్టెంబర్ 17.. అప్పటి వరకు రాచరిక పాలనలో ఉన్న హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైంది. ఆ తర్వాత ప్రజాస్వామ్య పద్ధతిలో 1952 జనవరిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. వాటితో పాటే నాటి హైదరాబాద్లోని అసెంబ్లీ నియోజకవర్గాలకూ ఎన్నికలు జరిగాయి. దీంతో హైదరాబాదీలు మొదటిసారి తమ ఓటు హక్కును వినియోగించారు. 1956లో ఎంసీహెచ్ ఏర్పడినా.. అప్పుడు ఎన్నికలు జరగలేదు. ప్రత్యేక అధికారితోనే బల్దియా పాలన సాగింది. హైదరాబాద్ సంస్థానంలో విలీనం అనంతరం హైదరాబాద్ బల్దియాకు తొలిసారిగా 1960లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు ఎనిమిదో విడత ఎన్నికలు జరగబోతున్నాయి.