ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ముందుకొచ్చి మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకొని ప్రజలలో నమ్మకాన్ని కలిగించారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కాగానే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొదటి టీకా వేయించుకుంటారు అని ప్రచారం కూడా జరిగింది. ఇక అన్ని రాష్ట్రాలలో లాగానే తెలంగాణలో కూడా ఇదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరూ అనుకున్నట్లుగా మొదటి టీకా ఆరోగ్య శాఖ మంత్రి కాదు.. పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ కు ఇచ్చారు. అయితే ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ తాను వ్యాక్సిన్ ఎందుకు వేసుకోలేదో చెప్పుకొచ్చారు.
ప్రాణాలకు తెగించి కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్న సమయంలో డాక్టర్లు నర్సులు శానిటేషన్ సిబ్బంది కరోనా వైరస్ పై యుద్ధం చేశారని.. ప్రాణత్యాగం కూడా చేశారు అంటూ గుర్తుచేశారు ఈటల రాజేందర్. ప్రధాని మోదీ వారికి ముందు వ్యాక్సిన్ అందించాలని సూచించారు. అందుకే మొదటి వ్యాక్సిన్.. పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మకు ఇచ్చామని.. అందుకే తాను మొదటి వాక్యం తీసుకోలేదు అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఇక ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం కరోనా బాధితులకు వైద్యం అందించామని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.