చీటికి మాటికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ డైరెక్టుగా కానీ లేదా టీడీపీ మద్దతుతో ఇతరులు కానీ చాలా విషయాల్లో కోర్టులో కేసులు వేశారు. ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ప్రజాహిత వ్యాజ్యమనో లేకపోతే మరో పేరుతోనో కోర్టుల్లో టీడీపీ చాలెంజులు చేస్తోంది. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైనన్ని కేసులు దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు కాలేదని కోర్టే వ్యాఖ్యానించింది.





మరిలాంటి నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జారీచేసిన జీవో 1 కి వ్యతిరేకంగా టీడీపీ ఎందుకని కోర్టులో కేసు వేయలేదు ? పైగా జీవో 1కి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేస్తానని ప్రకటించిన జనసేన నేత నాగబాబు కూడా ఇంతవరకు కేసు ఫైల్ చేయలేదు. జీవో 1 ని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ జాయింటుగా చీకటి జీవో అని, ఎమర్జెన్సీకన్నా ఘోరమైనదని చాలాసార్లు మండిపడ్డారు. మీడియా సమావేశాల్లో, ట్విట్టర్ వేదికగా, పార్టీ నేతల సమావేశాల్లో ప్రభుత్వ నిర్ణయంపై మండిపోతున్న నేతలు కోర్టులో కేసులు మాత్రం ఎందుకేయలేదు ?





ఇపుడీ విషయమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులపై సీపీఐ మాత్రమే కోర్టులో కేసు వేసింది. రాజధాని అమరావతి దర్యాప్తు, సిట్ విచారణ, ఇంగ్లీషుమీడియంకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా, రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వటం లాంటి అనేక అంశాలపై కోర్టుల్లో టీడీపీ సుమారు వంద కేసులను వేసుంటుంది. టీడీపీ వేసిన కేసుల్లో నిజంగానే ప్రజాహితమైనవి ఎన్ని, రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేవి ఎన్ని, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల టీడీపీకి ఇబ్బందులు తప్పవని భయపడి వేసిన కేసులెన్ని అన్నవి గమనించాల్సిన అంశాలు.





అయితే వీటన్నింటినీ పక్కనపెట్టేస్తే తాజాగా జీవో 1కి వ్యతిరేకంగా మాత్రం ఇప్పటివరకు కోర్టులో టీడీపీ కేసే వేయలేదు. ఒకవేళ కోర్టులో కేసువేస్తే కోర్టులో ఎదురుదెబ్బ తప్పదని అర్ధమైపోయిందా ? కోర్టులో కేసు వేసిన తర్వాత రాజకీయ డ్రామాలు సాధ్యంకాదని అనుకున్నదా ? అసలు జీవో 1 జారీచేయాల్సిన అవసరం ఏమొచ్చిందని కోర్టు ఆరాతీస్తే మొదటికే మోసం వస్తుందని భయపడిందా ?

మరింత సమాచారం తెలుసుకోండి: