
అయితే, నితీష్ను బీహార్ రాజకీయాల నుంచి దూరం చేయాలన్న బీజేపీ ఆలోచనకు జేడీయూ సహకరించబోదనే సంకేతాలు లభిస్తున్నాయి. నితీష్ కుమార్ పార్టీ క్యాడర్ ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ ను రాజకీయాల్లోకి తీసుకురావడంపై ఇప్పటికే పావులు కదుపుతోంది. అంటే పార్టీ భవిష్యత్తును ముందుగానే ప్లాన్ చేస్తున్నట్లే. ఇది బీజేపీ వ్యూహాలకు అడ్డుగోడగా మారుతోంది. ఇక చంద్రబాబు నాయుడు విషయానికి వస్తే... ఢిల్లీ స్థాయిలో రాజ్యాంగబద్ధ పదవిని ఆయన ఆశించరని, అలాంటిది వచ్చినా శ్రద్ధ చూపే అవకాశం తక్కువని వర్గాలు చెబుతున్నాయి. ఆయన దృష్టి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపైనే ఉంది. లోకేష్ను వారసుడిగా రాజకీయాల్లో నిలబెట్టే బాధ్యతనూ ఆయన ఏ మాత్రం తేలికగా తీసుకోవడం లేదు. పైగా క్యాడర్ అభీష్టం కూడా బాబు ముఖ్యమంత్రి గానే కొనసాగాలని కోరుతోంది.
అయినప్పటికీ, బీజేపీ ఎప్పుడూ పొత్తులకు ఊహించని కోణాలనూ జోడిస్తూ వ్యూహాలు వేస్తూ ఉంటుంది. బీహార్ , ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మిత్రుల నుంచి ప్రయోజనం పొందుతూ, వారిని బలహీనపరచే కుతంత్రాలు ఆ పార్టీ పరోక్షంగా చేపడుతుంటుందన్నది వాస్తవం. ఉప రాష్ట్రపతి పదవి కేంద్రంగా ప్రస్తుతం నడుస్తున్న ఈ చర్చలు.. బీజేపీ పొత్తుల తాత్కాలికత , పరస్పర ఉపయోగకారిత లకు ప్రతీకగా నిలుస్తున్నాయి. చివరికి ఆ పదవి ఎవరిదవుతుంది? నితీష్కు అందుతుందా? లేక ఆయన దానిని మానుకుంటారా? చంద్రబాబును గౌరవస్థానానికి ఆహ్వానిస్తారా? అన్నదీ రాజకీయంగా ఆసక్తికరమైన అంశమే. అయితే ఈ ఇద్దరు నేతలు - నితీష్ , చంద్రబాబు - తాము రాజకీయంగా దిట్టలమే అని ఇప్పటికే రుజువు చేసుకున్నారు. బీజేపీ ఎన్ని వ్యూహాలు వేసినా, వారి అంగీకారం లేకుండా ఎలాంటి భారీ మార్పులు జరగడం కష్టం. ఇక, ఈ ఎన్డీయే ప్రాణ మిత్రుల చుట్టూ తిరిగే రాజకీయ తంత్రాలు భవిష్యత్తులో మరింత ఉత్కంఠ రేపేలా ఉండవచ్చు.