జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో బీజేపీ స్ట్రాటజీపై సస్పెన్స్ ఎట్టకేలకు తెరలేపింది. ఎన్నో రోజులుగా బలమైన అభ్యర్థిని ప్రకటిస్తామని హైప్ క్రియేట్ చేసిన బీజేపీ నేతలు చివరికి పాత అభ్యర్థికే బీఫారం ఇచ్చారు. 2018 ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే మరోసారి రంగంలోకి దింపుతున్నారు. మొదట నుంచి బలమైన అభ్యర్థిని రంగంలోకి తీసుకురావాలని అనుకున్న బీజేపీ — పలు పేర్లను పరిశీలించింది. మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్, సినీ నటిని–నేతగా మారిన జయసుధ పేర్లు కూడా రేసులో చర్చించబడ్డాయి. కానీ చివరికి ఎవరూ రెడీ కాలేదో లేక పార్టీ నమ్మకం కలిగించలేదో తెలియదు.. కానీ దీపక్ రెడ్డికే బీజేపీ తుది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.


ఈ సీటు మీద మొదటి నుంచే కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే హై వోల్టేజ్ పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ బీసీ అభ్యర్థిని రంగంలోకి దింపింది. బీఆర్ఎస్ తమ బలమైన క్యాడర్‌తో ఆ సీటును ఏ కట్టిపడేయాలనే ఆలోచనలో ఉంది. మజ్లిస్ పార్టీ మాత్రం ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిని మద్దతు ఇస్తోంది. ఈ కాంబినేషన్ వల్ల బీజేపీకి పరిస్థితి కఠినంగా మారింది. బీజేపీ ఈ ఉపఎన్నిక పట్ల చాలా నిర్లిప్తంగా వ్యవహరించిందనే అభిప్రాయం ఉంది. ఉపఎన్నిక వస్తుందని ముందే తెలిసినా ఎటువంటి స్ట్రాటజీ, బూత్ లెవల్ ప్లానింగ్ సిద్ధం చేయలేదు. చివరి నిమిషంలో అభ్యర్థి ఎంపికకు దిగడం వల్ల గ్రౌండ్‌లో వేడి పెంచడం కష్టంగా మారింది. మరోవైపు, కాంగ్రెస్ ఇప్పటికే బూత్ లెవెల్ వరకు క్యాంపెయిన్ మిషన్ స్టార్ట్ చేసి వేగంగా ముందుకు వెళ్తోంది.



ఇక లంకల దీపక్ రెడ్డి విషయంలో టీడీపీ ఓ ప్రత్యేకమైన రోల్ ప్లే చేయవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు టీడీపీ లో కీలక నేతగా ఉన్న దీపక్ రెడ్డికి టీడీపీ క్యాడర్ నుంచి సహకారం లభించే అవకాశం ఉంది. ఈ మద్దతు ఆయన ఓటు బ్యాంక్‌కు కొంత బలం ఇవ్వవచ్చు. అయితే బీజేపీ అగ్రనేతలు ఆయన కోసం ఎంతవరకు ఫీల్డ్‌లోకి వస్తారన్నది అసలైన ప్రశ్న. జూబ్లిహిల్స్ సీటు ప్రతిష్టాత్మకంగా మారింది. బీజేపీకి ఇది టెస్టింగ్ గ్రౌండ్‌లా భావిస్తున్నారు. ఒకవేళ దీపక్ రెడ్డి గట్టి పోటీ ఇస్తే, హైద్రాబాద్‌లో బీజేపీకి బూస్ట్ లభించే అవకాశం ఉంది. లేకపోతే ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే క్లాసిక్ పోటీగా మారిపోతుంది. ఏదేమైనా.. ఈ ఉపఎన్నికలో బీజేపీ ఆఖరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం గెలుపు గేమ్‌ను ఎంతవరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: