
కేవలం 22 ఏళ్ల ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన మెరుపు ఇన్నింగ్స్లో 9 సిక్సులు, 7 ఫోర్లు దంచికొట్టాడు. ఇక 13వ ఓవర్లో అయితే ఏకంగా CSK పేసర్ మతీష పతిరణ బౌలింగ్ను చీల్చి చెండాడాడు. ఆ ఓవర్లోనే 22 పరుగులు పిండుకుని సెంచరీ మార్క్ అందుకున్నాడు. చివరకు స్పిన్నర్ నూర్ అహ్మద్ బౌలింగ్లో ఔట్ అయ్యే ముందు 42 బంతుల్లోనే 103 పరుగులు చేశాడు. అతను డగౌట్కు తిరిగి వెళ్తుంటే సహచరులే కాదు, ఏకంగా పంజాబ్ కింగ్స్ సహ యజమాని కూడా లేచి నిలబడి చప్పట్లు కొడుతూ అభినందించారంటే అర్ధం చేసుకోవచ్చు, ఆ ఇన్నింగ్స్ ఏ రేంజ్లో ఉందో.
ప్రియాన్ష్ 39 బంతుల్లో చేసిన సెంచరీ ఇప్పుడు IPL చరిత్రలోనే రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డులకెక్కింది. భారతీయుల్లో అయితే ఇది రెండో స్థానం. ఇంతకుముందు యూసుఫ్ పఠాన్ 2010లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ముంబై ఇండియన్స్పై 37 బంతుల్లో సెంచరీ కొట్టాడు. అదే ఫాస్టెస్ట్ సెంచరీగా కొనసాగుతోంది.
మరింతకీ ఈ ప్రియాన్ష్ ఆర్య ఎవరు?
ప్రియాన్ష్ ఆర్య ఢిల్లీకి చెందిన ఒక విధ్వంసకర ఓపెనింగ్ బ్యాటర్. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) తొలి సీజన్లోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ప్రియాన్ష్, ఏకంగా 10 ఇన్నింగ్స్లలో 608 పరుగులు చేసి టాప్ రన్-స్కోరర్గా నిలిచాడు. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్తో జరిగిన ఒక మ్యాచ్లో అయితే ఏకంగా ఒకే ఓవర్లో ఆరు సిక్సులు బాది అదరగొట్టాడు.
2023-24 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా తన ఫామ్ను కొనసాగించాడు. ఢిల్లీ తరఫున లీడింగ్ రన్-స్కోరర్గా నిలిచి 7 ఇన్నింగ్స్లలో 166.91 స్ట్రైక్ రేట్తో 222 పరుగులు చేశాడు.
ఇంతలా రాణించినా కూడా IPL 2024 వేలంలో అతన్ని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ప్రియాన్ష్ చాలా నిరాశ చెందాడు. కానీ 2025 వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని ఏకంగా రూ. 3.8 కోట్లకు కొనుగోలు చేసింది. అప్పుడు సంతోషంగానే ఉన్నా, జరుగుతున్న మ్యాచ్లపైనే ఫోకస్ పెట్టానని ప్రియాన్ష్ చెప్పాడు. ఇప్పుడు, ఈ అద్భుతమైన సెంచరీతో ప్రియాన్ష్ ఆర్య పేరు ప్రతి క్రికెట్ అభిమాని నోటా మారుమోగిపోతోంది.