ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన 1.45 లక్షల సీసీటీవీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. చైనాతో మనకు తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు చైనా వస్తువులు అన్నింటిని బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కూడా చైనా వస్తువులు బ్యాన్ చేయాలన్న నిరసనలు ఊపందుకున్నాయి. సోమవారం కేంద్ర ప్రభుత్వం చైనాకు చెందిన 59 యాప్లను బ్యాన్ చేసింది.
అయితే కేజ్రీవాల్ ఎన్నిల ప్రచారంలో ప్రజల భద్రతకు సీసీ కెమేరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రభుత్వం చైనాకు చెందిన హిక్విజన్ కంపెనీ నుంచి వీటిని కొనుగోలు చేసింది. సీసీటీవీ కెమెరాల వల్ల నష్టం లేదు కానీ జనాలు లైవ్ ఫీడ్ను చూడటం కోసం ఈ కంపెనీ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీనివల్ల పెద్ద నిఘా ప్రమాదం వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేతలు దీనిపై స్పందిస్తూ కేజ్రీవాల్ ప్రభుత్వం తక్షణమే ఈ ఒప్పందం రద్దు చేసుకోవాలని విమర్శలు చేస్తున్నా... ఆప్ నేతలు మాత్రం ఇదంతా రాజకీయం అని కొట్టి పడేస్తున్నారు.