పెద్దనోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. అయితే ఆ ప్రభావం 2019 ఎన్నికల్లో కనిపించలేదు ఆ సమయానికి సర్జికల్ స్ట్రైక్స్, ఇతర దేశాలతో యుద్ధ వాతావరణమే హైలెట్ అయింది. భారత్ ని రక్షించడానికి ఏకైక ప్రత్యామ్నాయం ఎన్డీఏ అనే ప్రచారం జరిగింది. దీంతో మరోసారి బీజేపీ ఆధ్వర్యంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడింది. అప్పటికంటే ఇప్పుడు పరిస్థితులు దారుణంగా ఉన్నా యూపీలో గట్టెక్కడం మోదీ టీమ్ కి సాధ్యమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇటీవల 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తిగా అనుకూల ఫలితాలు రాలేదు. సరిగ్గా ఆ ఎన్నికల ప్రచార సంరంభం మొదలైన సమయంలో.. అంతర్జాతీయ కుట్ర అనే మాటను మోదీ వాడారు. భారత్ పై అంతర్జాతీయ కుట్ర జరుగుతోందనే అనుమానాలున్నాయని సెలవిచ్చారు. సరిహద్దుల్లో మెల్లగా అలజడి మొదలవుతోంది. చైనా యుద్ధవిమానాలు మాక్ డ్రిల్ చేపట్టాయని, సరిహద్దుల్లో యుద్ధవాతావరణం నెలకొందనే సంకేతాలిచ్చారు. ఇక కరోనా విషయంలో కూడా చైనాని నిందించడం మొదలైంది. సరిహద్దుల విషయాలు యూపీ ఎన్నికలను ప్రభావితం చేస్తాయా లేదా అనే విషయాలను పక్కనపెడితే.. బీజేపీ మాత్రం ఆ దిశగా ప్రచారం చేసుకుంటుందనుకోవడంలో అనుమానం లేదు. అదే సమయంలో సోషల్ మీడియాను కంట్రోల్ చేయడంపై కూడా బీజేపీ పూర్తి స్థాయిలో దృష్టిపెట్టంది. వాట్సప్ కి తాఖీదులు, ఫేస్ బుక్ కి ఆజ్ఞలు ఇవన్నీ అందులో భాగమే. ఇలాంటి ప్రయత్నాలు బీజేపీని ఒడ్డునపడేస్తాయో లేదో తెలియదు కానీ.. ఇలాంటి ప్రణాళికలు రచించడంలో మోదీ-అమిత్ షా ద్వయం మాత్రం ముందంజలో ఉంటుంది. 2019 లోక్ సభ ఎన్నికల ఫార్ములా 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.