పేదలకు సాయం చేయడం ఒక్కటే కాదు.. ఆ చేసిన సాయాన్ని తమ క్రెడిట్‌గా చెప్పుకోవాలి.. దాన్ని అభిమానంగా మార్చుకోవాలి..ఆ అభిమానం ఓట్ల రూపంలోకి మారేలా చూసుకోవాలి.. ఇప్పుడు ఏపీలో సీఎం జగన్ చేస్తున్నది అదే అనిపిస్తోంది. జగన్ సర్కారు ఆరోగ్య శ్రీ సేవలను  పటిష్టంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. జగన్ అధికారంలోకి వచ్చాక అనేక వందల రోగాలను కూడా ఆరోగ్య శ్రీ జాబితాలో చేర్చారు. చక్కటి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.


అయితే.. ఆ విషయాన్ని జనానికి అర్థమయ్యేలా చెప్పాలి కదా.. అందుకే కొత్త విధానాలు అవలంభిస్తున్నారు. దీని కోసం ఆరోగ్య శ్రీ లబ్ధిదారులకు వర్చువల్‌ అకౌంట్లు క్రియేట్‌ చేస్తున్నారు. ఇకపై  ఈ అకౌంట్ల ద్వారా ఆరోగ్య శ్రీ డబ్బు నేరుగా ఆస్పత్రులకు వెళ్తుందన్నమాట. డబ్బులు డిడక్ట్‌ అవగానే  పేషెంట్‌ సెల్‌ఫోన్‌కు ఎస్ ఎంఎస్  వెళ్తుంది. రోగులు డిశ్చార్జి అయ్యేటప్పుడు వారికి అందిన వైద్యసేవలపై కన్సెంట్‌ లెటర్‌  తీసుకుంటారు. లంచాలు లాంటి ఘటనలు ఉంటే ఫిర్యాదు చేయడానికి వీలుగా ఏసీబీ 14400 నంబర్ కన్సెంట్‌ లెటర్‌పై పెట్టారు.


అంతే కాదు.. రోగి  డిశ్చార్జ్‌ అయి ఇంటికి వెళ్లిన తర్వాత  ఏఎన్‌ఎం రోగి ఇంటికి వెళ్లి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుంటారు. ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రల పనితీరుపై  పేషెంట్‌ నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు.  పేషెంట్‌ ఇంటికి వెళ్లిన  ఏఎన్‌ఎం తగిన విచారణ చేసి తర్వాత సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేస్తారు. ఆరోగ్యశ్రీ చికిత్స అనంతరం పేషెంట్‌కి ఇంకా అదనంగా మెడికేషన్‌ అవసరమైన పక్షంలో  సంబంధించి వైద్యాధికారితో ఏఎన్‌ఎం మాట్లాడి, తగిన చికిత్స అందించేలా చూస్తారు.


ఆరోగ్య శ్రీ ఎంప్యానెల్‌ ఆస్పత్రుల వివరాలను అందరికీ అందుబాటులో ఉంచుతారు. ఈ వివరాలను విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ప్రత్యేకంగా హోర్డింగ్‌ లు పెడతారు. 104 కాల్‌సెంటర్‌కు ఫోన్‌ చేసిన వెంటనే ఎంప్యానెల్‌ ఆస్పత్రి సమీపంలో ఎక్కడుందో వివరాలు తెలిసేలా చర్యలు తీసుకుంటారు. ఈ కొత్త విధానం ద్వారా తన ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందనేదని ప్రతి రోగికీ తెలుస్తుంది. అధికార పార్టీ నేతలు కూడా ఇదిగో నీ కోసం ఇంత ఖర్చు చేశాం.. మరి మాకు ఈసారి ఓటు వేయవా అని అడిగేందుకు వీలుంటుంది. ఐడియా అదిరింది కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: