మన మీద మనకు నమ్మకమే మనల్ని ఉన్నత శిఖరాలను ఎక్కిస్తుంది. జీవితంలో ఇంతకు మించి ఇంకేం కావాలి? అనే పరిస్థితిని సృష్టించుకుని అందనంత ఎత్తుకు ఎదుగుతున్న వారు మన దేశంలోనూ ఎందరో ఉన్నారు. ఎక్కడో మారుమూల పల్లెలో పుట్టిన ఆ వ్యక్తి.. ఉన్నత చదువులు కూడా చదువని ఓ వ్యక్తి.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన టవర్లో 22 అపార్టుమెంట్లు కొనడమంటే మాటలా! సినిమా కథలా తలపించే ఓ సక్సెస్ జర్నీ మీకోసం.
చింతగింజల పొట్టుతో వ్యాపారం చేసిన ఓ సాదాసిదా వ్యక్తి.. ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణం బుర్జ్ ఖలీఫాలోని 22 అపార్ట్మెంట్లకు యజమాని అంటే నమ్ముతారా? ఆ ఆకాశ సౌధంలో అతనే ఎక్కువ అపార్ట్మెంట్లు కొన్నాడంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. చింతగింజల పొట్టు నుంచి బుర్జ్ ఖలీఫా వరకూ అతని ప్రయాణం ఆసక్తికరం. ఆ వ్యక్తి ఏ విదేశీయుడో కాదు. కేరళ వాసి సాధించిన ఘనత ఇదీ..! చెమట చుక్కలు చిందిస్తూనే.. పక్కా ప్రణాళికతో, తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగాడు జార్జ్.
కేరళలోని తిరుచూర్ దగ్గర ఓ పల్లెటూళ్లో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు జార్జి. తండ్రి ధాన్యం వ్యాపారి. వృథాగా పడేసే చింత గింజల్ని సేకరించి వాటిపైన పొట్టుని పశువుల దాణాగా అమ్మేవారు. చిన్నప్పట్నుంచీ జార్జ్ తండ్రితో పాటు మార్కెట్కు వెళ్తూ వ్యాపార పాఠాలు నేర్చుకున్నారు. పత్తి విత్తనాలు కొనుగోలు చేసి.. 90 శాతం లాభానికి జిగురు పరిశ్రమలకు అమ్మేవారు. 1976లో ఆటోమొబైల్ మెకానిక్గా షార్జాకు వెళ్లాడు జార్జ్. అక్కడ ఏసీల వ్యాపారానికి డిమాండ్ ఉండడంతో ఏసీలూ, ఫ్రిజ్ల రిపేర్లు, అమ్మకాలు ప్రారంభించాడు. ఆ వ్యాపారంలో బాగా డబ్బు సంపాదించాడు. వాటితో షార్జాలో జీయీవో ఎలక్ట్రికల్స్ ట్రేడింగ్ అండ్ కాంట్రాక్టింగ్ కో ఎల్ఎల్సీ పేరుతో పెద్ద దుకాణాన్ని తెరిచాడు జార్జ్. అందులో అన్ని బ్రాండ్ల ఏసీలూ, కూలర్లూ, ఫ్రిజ్లను అమ్మకానికి పెట్టాడు. డిమాండ్కు తగ్గట్లు లాభాలు ఉండడంతో జియాన్ ఎయిర్ పేరుతో ఏసీలూ, కూలర్ల తయారీని ప్రారంభించాడు. వీటితోపాటుగా మరిన్ని వ్యాపారాలకు శ్రీకారం చుట్టాడు.
సక్సెస్ జర్నీ ఇలా...
తన వ్యాపారాలను లాభాల బాట పట్టించేందుకు జార్జ్.. తెలివైన ప్రణాళికను రూపొందించాడు. అలా కొనసాగిస్తూ కొద్దికాలంలోనే కోటీశ్వరుడయ్యాడు. బిజినెస్ చేస్తున్న సమయంలో ప్రపంచంలోనే ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫా నిర్మాణం జరుగుతోంది. ఆ సమయంలో తన స్నేహితులు ఆ టవర్ గురించి గొప్పగా మాట్లాడుకోవడం జార్జ్ గమనించాడు. బుర్జ్ ఖలీఫాకు వెళ్లడం అసాధ్యమనే మాటలు జార్జ్ చెవిలో పడ్డాయి. ఆరోజు స్నేహితుడు సరదాగా అన్న ఆ మాటల్ని సీరియస్గా తీసుకొని.. ఆ మరుసటి రోజే ఒక ఫ్లాట్ కొన్నారు. అది దుబాయి మెట్రోకి చేసిన ఒక ప్రాజెక్టులో వచ్చిన డబ్బు. ఆ తర్వాత 6 సంవత్సరాల్లో 22 అపార్ట్మెంట్ల వరకూ కొన్నాడు జార్జ్. వీటిలో కొన్నింటిని అద్దెకు ఇస్తున్నాడు. ఈ అపార్ట్మెంట్ల నిర్వహణకే ఏటా అయిదున్నర కోట్ల రూపాయల్ని ఖర్చుచేస్తున్నాడు జార్జ్. దుబాయితోపాటు షార్జా, రస్ అల్ కైమా, మేదాన్, అజ్మాన్లలో స్థిరాస్తులు సంపాదించాడు. ఇంకో విషయం ఏంటంటే.. బుర్జ్లో 900 అపార్ట్మెంట్లుంటే అందులో 150 వరకూ భారతీయులూ, ప్రవాస భారతీయులే కొన్నారట. నాకిప్పుడు బుర్జ్లో 22 ఫ్లాట్లు ఉన్నాయి. భవిష్యత్తులో మరిన్ని కొనాలనుకుంటున్నా. ఆరోజు నా స్నేహితుడి మాటల్ని నేను సీరియస్గా తీసుకున్నాను. అసాధ్యం అనే పదం నాకు నచ్చదు అని అంటాడు జార్జ్.
మన దేశంలో కూడా ఏసీలూ, కూలర్ల బిజినెస్, స్థిరాస్తి రంగాల్లో అడుగుపెట్టాడు జార్జ్ వి నెరియపరంబిల్. కొత్త విషయాలను నిరంతరం నేర్చుకుంటూ.. కలల్ని సాకారం చేసుకోవాలి అంటూ నేటి యువతకు సక్సెస్ టిప్స్ చెబుతున్నాడు. మొత్తానికి జార్జి సక్సెస్ జర్నీ ఈ తరం యువతకు గొప్ప స్ఫూర్తి.