ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అక్రమ ఆస్తుల కేసుల విచారణలో ఇంత జాప్యం జరగడం వెనుక లాజిక్ ఏంటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ జాప్యం కావడంపై సుప్రీంకోర్టులో ఎంపీ రఘురామకృష్ణం రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు దీనిపై ఇప్పటి వరకు కనీసం ఒక్క డిశ్చార్జి పిటిషన్‌నైనా పరిష్కరించారా అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. ట్రయల్ కోర్టులో జాప్యానికి ఆ సంస్థ బాధ్యత వహించదని సీబీఐ న్యాయవాదులు పేర్కొన్నారు. ఆ ఆలస్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది. తెలుగు రాష్ట్రాల నుంచి సీఎం జగన్ తదితరులపై కేసులు బదలాయించాలంటూ వైఎస్సార్‌సీపీ పిటిషనర్, ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. ఎందువల్ల జగన్ కేసుల విచారణ ఆలస్యం అవుతుందో పూసగుచ్చినట్లు వివరించింది. దానికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

ఏపీలో 2011లో జగన్ పై అక్రమాస్తుల కేసులు నమోదు అయ్యాయి. ఈ దర్యాప్తును సీబీఐ కేవలం రెండేళ్లలో ముగించింది. 2013లోనే కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేసింది. అప్పటి నుంచి ఈ కేసులో పురోగతి లేదు. ఈ నేపథ్యంలో సీబీఐకి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. దీంతో కేసుల జాప్యానికి గల కారణాలను సీబీఐ వెల్లడించింది. సీబీఐ చివరి చార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత నిందితులు కేసు విచారణను అడ్డుకునేందుకు ఏం చేశారో వివరించింది. 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జ్ పిటిషన్లను నిందితులు దాఖలు చేయడంతో కేసు విచారణ ఇంకా సాగుతోందన్నారు. కేవలం విచారణను అడ్డుకునేందుకు, జాప్యం చోటు చేసుకునేందుకే ఇలా చేసినట్లు వాదించింది. ఆ క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్లను పూర్తిగా విచారించకుండానే కోర్టులో జడ్జిలు మారిపోతున్నారని సుప్రీంకోర్టు దృష్టికి సీబీఐ న్యాయవాదులు తెలియజేశారు. ఈ కేసులో నిందితులు బాగా శక్తివంతులు కావడంతో కేసు విచారణ ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ప్రశ్నించింది. పిటిషనర్ రఘురామకృష్ణం రాజు కోరినట్లు మరో రాష్ట్రానికి సీబీఐ విచారణ మారిస్తే మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో మొత్తం సాక్షులు 911 మంది ఉన్నట్లు సీబీఐ నివేదించింది. అయితే వారంతా 50 ఏళ్లు దాటిన వారని, కేసును మరో రాష్ట్రానికి మారిస్తే విచారణలో మరిన్ని అడ్డంకులు వస్తాయని సీబీఐ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: