పల్లెకు ఢిల్లీ ఫీవర్ పట్టుకుంది. ఇంతకాలం నగరాలు, పట్టణాలకే పరిమితమైందనుకుంటున్న కరోనా వైరస్ ఇప్పుడు గ్రామాలకూ చేరింది. విదేశాల నుంచి వచ్చిన వారితో పోలిస్తే.. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీ నిజాముద్దీన్ మార్కజ్లో నిర్వహించిన తబ్లీఘీ జమాత్కు హాజరై వచ్చిన వారితోనే ఎక్కువ ఆందోళన నెలకొంది. వివిధ దేశాల నుంచి వచ్చిన వారిలో కన్నా.. జమాత్కు హాజరై వచ్చిన వారిలోనే కరోనా కేసులు ఎక్కువ వెలుగు చూ స్తుండటం ఇందుకు కారణం. ఢిల్లీలోని మర్కజ్ మజీద్కు తెలంగాణ నుంచి 1,030 మంది వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. వీరిలో 603 మంది హైదరాబాద్కు చెందిన వారు కాగా, మిగిలిన వారంతా ఆయా జిల్లాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారే కావడం గమనార్హం. దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి మత ప్రార్థనకు వెళ్లినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు నిర్ధారించాయి.
కాగా ఇందులో గ్రామీణ ప్రాం తాలకు చెందిన వారు కూడా ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటే నగరాలు, పట్టణాలతో పోలిస్తే.. గ్రామాల్లో లాక్డౌన్ నిబంధనలు అంత కఠినంగా లేకపోవడంతో వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశం ఉంది. దీంతో ఇంతకాలం మనకేం కాదులే అన్న ధీమాతో ఉన్న గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇప్పుడు ఈ వార్త కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. అంతేగాక ఢిల్లీ నుంచి వారిలో ఆరుగురు కరోనా బారిన పడి చనిపోవడం మరింత భయాందోళ నకు గురిచేస్తోంది. ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన వారు ... స్నేహితులు, బంధువుల ఇళ్లకు వెళ్లడం, ప్రార్థనల్లో పాల్గొనడంతో వారెందరితో తిరిగారన్నది అంతుబట్టడంలేదు. కాగా ఢిల్లీ నుంచి వచ్చిన వారు ఒక్కొక్కరు పదిమందినైనా కలిసి ఉంటారు. అలా కనీసం 10 వేల మందితోనైనా వారు కాంట్రాక్ట్ అయి ఉండొచ్చని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కొందరైతే రోజువారి కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రార్థనలకు వెళ్లడం తదితర కారణాల వల్ల ఇంకా ఎక్కువ మందికి వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తుండటం గమనార్హం.