ప్రముఖ టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత ఆయన తుదిశ్వాస విడిచారు. ఇటీవల కరోనా సోకడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో నాయిని చికిత్స పొందారు.. తర్వాత చేసిన టెస్ట్ నెగిటివ్ రిపోర్ట్‌ వచ్చినా.. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో జూబ్లీహిల్స్‌ అపోలోకు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సహా మంత్రులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

నాయిని నర్సింహారెడ్డి నల్గొండ జిల్లా, దేవరకొండ మండలం, నేరేడుగొమ్ములో 1944 మే 12న సుభద్రమ్మ, దేవయ్యరెడ్డి దంపతులకు జన్మించారు. తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచీ కీలక పాత్ర పోషించిన నాయిని తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా వ్యవహరించారు. నాయిని ముషీరాబాద్ శాసనసభ్యుడిగా మూడుసార్లు గెలిచారు.. 1978, 1985, 2004లో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన తెలంగాణ ఆవిర్భావం వరకు కేసీఆర్ వెంట కీలకంగా వ్యవహరించారు. వైఎస్ ప్రభుత్వంలో 2005 నుంచి 2008 వరకు సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా పనిచేసిన నాయిని.. తెలంగాణ నూతన రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత తొలి హోంమంత్రిగా పనిచేశారు. తెలంగాణ హోంమంత్రిగా 2014 నుంచి 2018 వరకు బాధ్యతలు నిర్వహించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: