చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటు చేసుకున్న సంఘటనల దృష్ట్యా తిరిగి నామినేషన్ల దాఖలుకు ఎస్ఈసీ అవకాశం కల్పించినా తెదేపా నేతలు ముందుకు రాలేదు. పుంగనూరు లోని 9, 14, 28 వార్డుల్లో కొత్తగా నామినేషన్లు వేసేందుకు మరో అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్ఈసీ ప్రకటించింది. ఈ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొత్తగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం కల్పించింది. అయితే గడువు ముగిసినా ఒక్కరంటే ఒక్కరూ కూడా నామినేషన్ దాఖలు చేయకపోవడం గమనార్హం..
అధికార పార్టీ నేతల బెదిరింపులు కారణంగానే నామినేషన్లు దాఖలు చేయలేక పోయారని తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు అభ్యర్థులను వైకాపా నేతలు తీవ్రంగా భయపెట్టారని.. మరో ఇద్దరు అభ్యర్థులు ఎక్కడున్నారో తెలియడం లేదని పుంగనూరు తెదేపా ఇన్ఛార్జ్ శ్రీనాథ్ రెడ్డి ఆరోపించారు. వైకాపా దౌర్జన్యాలకు నిరసనగా అసలు నామినేషన్లే దాఖలు చేయకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ తమను పోటీ చేయనిస్తారన్న నమ్మకం లేదని వాపోయారు. జిల్లా మొత్తం ఇదే తంతు.. చిత్తూరు లో టీడీపీ పని అయిపోయినట్లు తెలుస్తుంది.