ఆమె పునరాగమనాన్ని దేశమంతా ఆసక్తిగా గమనించారు. ఏ నిర్ణయం తీసుకుంటుందా? అంటూ మునివేళ్లపై నిలబడి ఎదురుచూస్తున్నారు. ఆమె తీసుకునే నిర్ణయం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు కలిగిస్తాయేమోనంటూ రాజకీయ పార్టీలన్నీ దడదడలాడాయి. మోడీ-అమిత్షా ద్వయాన్ని ఢీకొట్టే ధీరురాలిగా చూశారు.
జైలు నుంచి విడుదలై తమిళనాడుకు చేరుకోగాలనే ఆమె తీసుకునే నిర్ణయం రాష్ట్రాన్ని కుదిపేస్తుందని అందరూ భావించారు. అత్యంత సంక్లిష్టమైన తమిళనాడు రాజకీయాల్లో ఆమె మరోమారు చక్రం తిప్పనుందని రాజకీయ పండితులందరూ భావించారు. ఆమె ఎవరో కాదు.. దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి.. శశికళ (చిన్నమ్మ). మరికొద్ది రోజుల్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయనగా. శశికళ షాకింగ్ ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో దోషిగా జైలు శిక్షను పూర్తి చేసుకుని, జనవరిలో విడుదైలన వీకే శశికళ తనను బహిష్కరించిన అన్నాడీఎంకే పార్టీపై తిరిగి పట్టు సాధించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మొన్న జయలలిత జయంతి నాడు కూడా తమిళ సినీ, రాజకీయ వర్గాలు ఆమె ఇంటికి క్యూకట్టడం, దాంతో శశికళ మళ్లీ జూలు విదిలించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. కానీ వాటన్నింటికీ రివర్సులో శశికళ ఏకంగా రాజకీయాల నుంచి, ప్రజా జీవితం నుంచి తప్పుకున్నారు. బుధవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో.. ఏనాడూ నేను అధికారంలో లేను. జయ అధికారంలో ఉన్నప్పుడుగానీ, పదవిలో లేనప్పుడుగానీ నేను ఏనాడూ అధికారం, పదవి కోసం అర్రులు చాచలేదు. జయ మరణం తర్వాత కూడా ఆ రెండిటినీ(పదవి, అధికారం) నేను కోరుకోలేదు. ఇప్పుడు రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. అయితే, జయ స్థాపించిన పార్టీ(ఏఐఏడీఎంకే) గెలవాలని ప్రార్థిస్తున్నాను. ఆమె వారసత్వం కలకాలం కొనసాగుతుంది'' అని వీడ్కోలు లేఖలో శశికళ పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలవడానికి బీజేపీతో శశికళ డీల్ ఇదే అయివుంటుందని అందరూ భావిస్తున్నారు.