సాధారణంగా ప్రజా ప్రతినిధులు అంతా కరోనా అంటే చాలు ప్రయివేలు ఆస్పత్రులకు పరుగులు తీస్తుంటారు. కార్పొరేట్ ఆస్పత్రిలోనే వైద్యం కావాలని పట్టుబడతారు. కానీ ఆ ఎమ్మెల్యే మాత్రం తన ధోరణిలో భాగంగా ప్రభుత్వ వైద్యానికే మొగ్గు చూపారు. ఈవిధంగా చేయడం వల్ల సర్కారు దవఖానాలు అంటే నమ్మకం పెరుగుతుందని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఆయన స్వల్ప లక్షణాలతోనే బాధపడుతున్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇంకాస్త వివరంగా చెప్పాలంటే...
ఆంధ్రావనిలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాజిటివిటీ రేటు అంతకంతకూ పెరుగుతోంది. పండగ రద్దీ దృష్ట్యా గ్రామాలన్నీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కళకళలాడుతున్నాయి.పండగ ప్రయాణాలు కూడా అలానే ఉన్నాయి.దీంతో కరోనా వ్యాప్తిపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, ఉత్సవాలు,వేడుకలు అన్నవి కొద్ది మందితోనే నిర్వహించుకోవాలని ప్రభుత్వం చెప్పినా సరే వినిపించుకునే స్థితిలో ఎవ్వరూ లేరు.భౌతిక దూరం పాటింపు అస్సలే లేదు.జిల్లాలలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్నా ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య మాత్రం ప్రస్తుతానికి తక్కువగానే ఉంది.ఇదే సమయంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావుకు కరోనా పాజిటివ్ అని తేలింది.నాలుగైదు రోజులుగా జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఆయన వైద్యం పొందుతున్నారు.ఇక్కడ అందుకుంటున్న వైద్య సేవలపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.అదేవిధంగా డబ్బులు పోసి వేలకు వేలు ఖర్చు పెట్టి ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయించవద్దని కూడా చెప్పారు.