అల్పపీడనం ప్రభావం వలన ఏపీ లోని కోస్తా, రాయలసీమలోని పలు చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ అల్పపీడన ప్రభావం నాలుగు రోజులు ఉంటుందని.. ఈ సమయంలో తీర ప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. పండగల సందర్భంగా యువత, మహిళలు సముద్ర స్నానాలకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా పలు చోట్ల బుధ, గురు వారాల్లో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశముందని హెచ్చరించారు.ఉత్తరాంధ్ర జిల్లాలో గత రెండు రోజులుగా కొన్ని చోట్ల ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి.ఇంకా అలాగే మరోవైపు తూర్పుగోదావరి, అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలతో పాటు, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని పలుచోట్ల బుధవారం వర్షాలు కురిశాయి.


ఈనెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు మధ్య మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉన్నాయి. ఈ ప్రభావంతో అక్టోబర్ 5వ తేదీ ( బుధవారం ) కోస్తాంధ్రాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబర్ 6వ తేదీ ( గురువారం ) కూడా ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల వానలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. కోస్తాంధ్రాలోని ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. అక్టోబర్ 9వ తేదీన ఏర్పడే అల్పపీడనం శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలో రానున్న నాలుగు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: