దేశ రాజధాని ఢిల్లీ బుధవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇంటి వద్ద ఊహించని సంఘటన చోటుచేసుకుంది. ప్రజల ఫిర్యాదులు వినడానికి, వారి సమస్యలను పరిష్కరించడానికి నిర్వహిస్తున్న ‘జన్ సునాయి’ కార్యక్రమంలో ఈ సడన్ డ్రామా జరిగింది. సీఎంపై నేరుగా ఒక వ్యక్తి రాయితో దాడి చేయడంతో, క్షణాల్లోనే అక్కడ గందరగోళం నెలకొంది. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజల్లో ఒకరిగా మారువేషం వేసుకుని, సదరు వ్యక్తి ముందుకు వచ్చాడు. మొదట సాధారణ ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్టే నటించాడు. కానీ ఒక్కసారిగా రాయిని తీసి సీఎం రేఖా గుప్తాపైకి విసిరేశాడు. ఈ దాడిని గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే యాక్షన్‌లోకి దిగి, ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.


అదృష్టవశాత్తూ, రాయి సీఎం దగ్గరకు చేరకపోవడంతో ఎలాంటి గాయాలు జరగలేదు. అయినా, ఆ క్షణాల్లో ఉన్న టెన్షన్ మాత్రం అక్కడున్న వారందరినీ షాక్‌కు గురి చేసింది. ఇక ఈ ఘటన దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యమంత్రి నివాసంలోనే ఇలా దాడి జరగడం తేలికగా తీసుకునే విషయం కాదని ప్రతిపక్షం నుండి అనేక వ్యాఖ్యలు వస్తున్నాయి. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. "సీఎం ఇంట్లోనే ఇలాంటి సంఘటన జరగడం చాలా విచారకరం. భద్రతా లోపాలు ఉన్నాయా? లేక ముందుగానే పన్నిన ప్లానా? అన్నది పోలీసుల విచారణలో తేలాలి" అని వ్యాఖ్యానించారు.ఇక పోలీసులు ఈ ఘటనపై ప్రత్యేక దృష్టి సారించారు. నిందితుడు ఎవరు? ఎందుకు ఇలా చేసాడు? వ్యక్తిగత రగడనా? లేక రాజకీయ కోణమా? అన్న అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.


ముఖ్యంగా ‘జన్ సునాయి’ అనే ఓపెన్ కార్యక్రమంలో భద్రతా లోపం ఎలా జరిగిందనే కోణంలో కూడా విచారణ సాగుతోంది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. "ఢిల్లీ సీఎం ఇంట్లో కూడా సేఫ్ కాకపోతే, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు "ఇది కేవలం యాదృచ్ఛిక దాడి కాదు, దీని వెనుక పెద్ద కుట్ర ఉండొచ్చు" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా, ఢిల్లీ రాజకీయాల్లో ఈ ఘటన కలకలం రేపింది. ఒక ముఖ్యమంత్రి ఇంటికే నేరుగా రాయి విసిరే ధైర్యం ఎలా వచ్చింది? వెనుక ఎవరు ఉన్నారు? అనే ప్రశ్నలకు జవాబు కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. పోలీసులు ఈ కేసును ఎంత త్వరగా ఛేదిస్తారో చూడాలి మరి!



మరింత సమాచారం తెలుసుకోండి: