హైదరాబాద్ జేఎన్టీయూలో ఉద్రిక్తం :
ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు తమ కెరీర్ కు ఆటంకంగా మారాయని ఆరోపిస్తూ హైదరాబాద్ జేఎన్టీయూ ఎదుట ప్రైవేటు లెక్చరర్లు ఆందోళనకు దిగారు. 2010 తర్వాత ఎంటెక్ పూర్తి చేసినవారు టీచింగ్ కు అనర్హులంటూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై ప్రైవేటు లెక్చరర్లు మండిపడుతున్నారు. ప్రైవేటు లెక్చరర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ ఆందోళన కొనసాగుతోంది. ఆందోళన నేపథ్యంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వర్సిటీలో భారీ భద్రత బలగాలను మోహరించారు.
పార్టీ పెడతాడంటే నమ్మను : ఉత్తమ్
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగానికి కూడా లెక్కచేయకుండా పోరాట పటిమ చూపించిన ప్రొఫెసర్ కోదండ రామ్ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తెలంగాణ కోసం పోరాడుతున్నారు. మరోవైపు ఆయన కొత్తగా పార్టీ పెడతారని పుకార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం పార్టీ పెడతారని తాను అనుకోవడం లేదని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఎవరు పోరాడినా తాము మద్ధతిస్తామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక శక్తులు బలపడాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎం నాయకుడు తమ్మినేని పాదయాత్రకు కాంగ్రెస్ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిందన్నారు.
వరంగల్ ఐటీ హబ్ గా మారుస్తాం :
వరంగల్ను ఐటీ హబ్గా తీర్చిదిద్దుతామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. వరంగల్లోని మడికొండలో గల ఇంకుబేషన్ టవర్లో ఆదివారం ప్రముఖ ఐటీ కంపెనీ సైయంట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో సెంటర్ను ప్రారంభించింది. కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కంపెనీలో నిర్వహించే కార్యకలాపాల గురించి ప్రతినిధులు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ లో 45 ఎకరాల్లో ఐటీ సెజ్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆరు కోట్లతో ఫస్ట్ ఫేజ్ ఇంక్యుబేటర్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. మరో ఆరు కోట్లతో రెండో ఫేజ్ కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.