
గత కొన్నిరోజుల ముందు వరకూ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో ఒక చిన్నపాటి యుద్ధమే నడిచిన సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఆమోదంతో ఏపీలో పంచాయతీ ఎన్నికలు షురూ అయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల వేడి తారాస్థాయికి క్రమక్రమంగా చేరుకుంటుంది. సాధారణంగా ఈ ఎన్నికలు ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా జరగాల్సినవి కానీ అలా జరగడం లేదు. గ్రామాల్లో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు నేరుగానే ప్రచారం చేస్తూ పోటీకి దిగుతున్నారు. అంతటితో ఆగకుండా ఈ ఎన్నికల ప్రచార క్రమంలో భాగంగా కొందరు ప్రజా ప్రతినిధులు బహిరంగంగానే చేస్తున్న వ్యాఖ్యలు, వార్నింగ్ లు వివాదాస్పదంగా మారుతున్నాయి.
తాజాగా కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన చర్చలకు దారి తీసింది. ఏకంగా ఎమ్మెల్యే పంచాయతీ ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల తరపున ప్రచారానికి వెళ్లటమే కాకుండా ఆ గ్రామంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ విషయమై టీడీపీతో పాటూ జనసేన పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామన్నారు. వార్డు మెంబర్గా పోటీచేసినా.. ప్రభుత్వ పథకాలు తీసి పారేయండన్నారు. ‘జగన్ ఇస్తున్న పథకాలు తీసుకుంటూ.. మనకు వ్యతిరేకంగా ఎలా నిలబడతారు’అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారని.. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్ వేస్తే పెన్షన్, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్ చేసి పారేస్తాం అని అన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
టీడీపీ తమ అఫిషియల్ అకౌంట్లో ఈ వీడియోను ట్వీట్ కు జతచేశారు. పబ్లిక్ మీటింగ్ లో పోటీ దారులను బెదిరిస్తున్న పెడన ఎమ్మెల్యే జోగి రమేష్.. కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గంలోని గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా వైసీపీ బలపరుస్తున్న వార్డ్ అభ్యర్థులపై పోటీ చేస్తే, వారికి అందే ప్రభుత్వ పథకాలను నిలిపి వేయాలంటూ బహిరంగ సభలో ఎమ్మెల్యే జోగి రమేష్ చెప్పడం వైసీపీ నియంతృత్వానికి నిదర్శనమని అన్నారు.. ఈ సంఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని.. ఎన్నికల సంఘం ఆదేశాలకు విరుద్ధంగా పోటీ దారులను, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. జోగి రమేష్పై ఎన్నికల కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది అన్నారు.