ప్రపంచంలో కరోనా ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరినీ చుట్టేస్తుంది. కొందరిని చంపేస్తుంది. తాజాగా కరోనా మహమ్మారి బారినపడిన దేశాధ్యక్షుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దక్షిణ అమెరికా దేశమైన బొలీవియా తాత్కాలిక అధ్యక్షురాలు జీనిన్ అనెజ్ కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, తాను క్షేమంగానే ఉన్నానని, ఐసోలేషన్ నుంచి విధులు నిర్వర్తిస్తానని గురువారం తెలిపారు. మరో టెస్ట్ తీసుకునే ముందు 14 రోజులపాటు క్వారంటైన్లో ఉంటానని 53 ఏండ్ల జీనిన్ సోషల్ మాద్యంలో పోస్ట్ చేశారు.
ఆమె మంత్రివర్గంలోని నలుగురు ఇటీవలే ఈ వైరస్ బారినపడడంతో అనుమానంతో జీనిన్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాగా, వెనిజులా రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు డియోస్డాడో కాబెల్లో కూడా కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా కరోనా కోరల్లో చిక్కుకుని బయటపడిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వచ్చినంత మాత్రాన కృంగిపోవడం తప్పని.. మనం దాన్ని ఎదిరించేందుకు పోరాడితే గెలుపు మనదే అవుతుందని ఆమె అన్నారు.