టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత కట్టుదిట్టంగా మాట్లాడినా, ఎంతసార్లు హెచ్చరించినా కొందరు ఎమ్మెల్యేల ప్రవర్తనలో మార్పు కనిపించడం లేదు. ఇది పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి మూడు నెలల్లోనే ఉచిత ఇసుక పంపిణీ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఇసుక కోసం కూడా కమీషన్లు కావాలంటూ పట్టుబట్టిన ఎమ్మెల్యేల వ్యవహారం తీవ్ర విమర్శలకు గురైంది. ఆ తరువాత మద్యం వ్యాపారంలోనూ లాబీయింగ్, కమిషన్ వ్యవహారాలు బయటకొచ్చి పార్టీని అసౌకర్యంలోకి నెట్టాయి.ఇవన్నీ బయటపడటంతో అప్పట్లోనే చంద్రబాబు అప్రమత్తమయ్యారు. నేరుగా ఎవరినీ ఉద్దేశించకపోయినా, అందరూ జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. అయినా పరిస్థితి మారలేదు. అనంతరం తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రవర్తన మరోసారి వివాదానికి దారి తీసింది. ఆయన దూకుడు, ప్రభుత్వంపైనే పదేపదే విమర్శలు చేసి పార్టీకి చికాకులు తెచ్చిపెట్టారు. పలు మార్లు పార్టీ తరఫున క్లాస్ ఇచ్చినా మార్పు పెద్దగా కనిపించలేదు.


ఇక ఒక్కొక్కరుగా మరికొందరు ఎమ్మెల్యేలు కూడా వివాదాస్పద మార్గంలో నడుస్తున్నారు. కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియలతో పాటు గుంటూరుకు చెందిన కొందరు ఎమ్మెల్యేలపై కూడా విమర్శలు వచ్చాయి. ఇవన్నీ రాజకీయ పరిణామాలకే పరిమితమయ్యినా, తాజాగా జరిగిన కొన్ని సంఘటనలు మాత్రం పార్టీని బాగా ఇబ్బంది పెట్టాయి. ఒక ఎమ్మెల్యే నేరుగా జూనియర్ ఎన్టీఆర్‌పై బూతుల పరంపర పెట్టిన ఆడియో బయటకు రావడం పెద్ద దుమారమే రేపింది. దీనిని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుని తీవ్రంగా ప్రచారం చేసింది. గుంటూరుకు చెందిన మరో కొత్త ఎమ్మెల్యే ఫోన్‌లోనే రాసలీలలు చేశారని వచ్చిన ఆరోపణలు పార్టీని మరింత ఇరుకున పడ్డాయి. ఎంత తప్పించుకోవాలనుకున్నా, సాక్ష్యాలతో బహిర్గతం కావడంతో పార్టీకి నష్టమే కలిగింది.


ఇదే సమయంలో సీనియర్ నేత, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఓ టీచర్‌ను బెదిరించారన్న ఆరోపణలు బయటకు రావడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఈ పరిణామాలతో పార్టీ ప్రతిష్టే ప్రమాదంలో పడిందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఇకపై ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరిస్తున్నా, వాటి అమలు ఎంతవరకు జరుగుతుందో చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం, కొన్ని ఎమ్మెల్యేల తీరుతో టీడీపీ ఇబ్బందులు పడుతున్నది వాస్తవమే.

మరింత సమాచారం తెలుసుకోండి: