సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరోల హవానే ఉంటుంది. కథానాయకుల చుట్టూనే స్టోరీ అంతా తిరుగుతుంది. హీరోయిన్ లు కేవలం సపోర్టింగ్ ఆర్టిస్ట్ లుగానే మిగిలిపోతారు. కానీ సాయిపల్లవి అందరి హీరోయిన్ లలా కాదు. తన తొలి మూవీ నుంచే ప్రత్యేకతను చాటుకుంటోంది. తన సొంత ఇమేజ్ తో ప్రేక్షకులను థియేటర్ల వైపు వచ్చేలా ఆకట్టుకుంటోంది.

సాయి పల్లవి టాప్ హీరోలతో కలిసి సినిమాలు చేయలేదు గానీ.. టాప్ పెర్ఫామర్‌ అనే ఇమేజ్‌ మాత్రం తెచ్చుకుంది. చేసిన ప్రతీ సినిమాలో ఏదో ఒక మార్క్‌ చూపిస్తోంది. ముఖ్యంగా డ్యాన్స్‌తో ఆడియన్స్‌ని ఫిదా చేస్తోంది పల్లవి. వందలకొద్ది మిలియన్ల వ్యూస్‌తో కొత్త కొత్త రికార్డులు సృష్టిస్తోంది. సాయి పల్లవి సినిమాల్లోకి రాకముందు డాన్స్‌ రియాలిటీషోల్లో పాల్గొంది. బెస్ట్‌ డాన్సర్‌గా ప్రూవ్‌ చేసుకొని, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చింది. హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన మళయాళం 'ప్రేమమ్‌'లో సూపర్‌ మూవ్స్‌తో మార్క్ చూపించింది. ఆ తర్వాత 'ఫిదా' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడి జనాలని ఆకట్టుకుంది. దేశవిదేశాల్లో సూపర్ హిట్ అయిన రౌడీ బేబి సాంగ్‌లోనూ సాయి పల్లవి డాన్సులు స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచాయి. 'ఎమ్.సి.ఎ.'లో ఏవండోయ్ నానిగారు, 'లవ్‌స్టోరి'లో సారంగదరియా ఇలా సినిమాకో పాటలో తన మార్క్ చూపిస్తోంది. ఇప్పుడు 'శ్యామ్‌సింగరాయ్'లో కూడా పల్లవి డాన్సులు హైలైట్‌గా నిలుస్తాయని చెప్తున్నారు. దీంతో జనాలకి సాయి పల్లవి సినిమా అనగానే డాన్స్‌ గుర్తుకొస్తుందని చెప్పొచ్చు.

మొత్తానికి సాయిపల్లవి డ్యాన్సులకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఆమె నాట్యానికి ప్రకృతి పరవశిస్తుందా అనేలా ఉంది. చలాకీగా ఈ నేచురల్ బ్యూటీ చేసే డ్యాన్స్ కు ప్రేక్షకులు కళ్లప్పగించి చూస్తున్నారు. సెకన్ల వ్యవధిలో స్టెప్పులు మారిపోవడం చూసి ఆశ్చర్యపోతున్నారు.రాబోయే రోజుల్లో సాయి పల్లవికి మరిన్ని అవకాశాలతో పాటు.. ఉత్తమ అవార్డులు కూడా సొంతం అవుతాయని భావిస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: