ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాల్లో టికెట్ల సమీకరణలు ఊపందుకున్నాయి. గెలుపు గుర్రాలను ఒడిసి పట్టుకుని అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ ప్రయత్నిస్తుండగా.. ఎలాగైనా పోయిన ప్రాభవాన్ని తిరిగి సంపాయించుకునేందుకు కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఈ క్రమంలోనే ఆచి తూచి అడుగులు వేస్తున్నారుకాంగ్రెస్ నాయకులు. ఈ క్రమంలోనే కేంద్రంలో తమకు ఉపయోగపడతారని భావిస్తున్న నాయకులపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ఏపీ నుంచి నేత ల జాబితాను తెప్పించుకున్నారు. వీరిలో కొందరికి ఎంపీ టికెట్లు ఇచ్చి. గెలిపించుకుంటే.. కేంద్రంలోని తన టీంలో చేర్చుకునేందుకు చూడాలని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫస్ట్ వినిపించిన పేరు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి.
వివాద రహితుడిగా, సౌమ్యుడిగా, అవినీతికి ఆమడ దూరంలో ఉండే నాయకుడిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కాంగ్రె స్లో ఎక్కువగా వినిపిస్తోంది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన నాయకుడిగా కూడా ఆయన పేరుతెచ్చుకున్నారు. కేంద్రానికి ఇక్కడ నుంచి పంపిన నివేదికల్లోనూ ఆయన నిర్మొహమాటంగా ఏపీ ప్రజల మనోభావాలను చెప్పుకొచ్చారు. అంతేకాదు, డీసెంట్ రాజకీయాలు చేయడంలోనూ ఆయనకు మంచి పేరుంది. అయితే, 2014 నాటి పరిస్థితుల్లో ఆయన సొంతగా సమైక్యాంధ్ర పార్టీ పెట్టుకున్నా.. అది సక్సెస్ కాకపోవడంతో సైలెంట్ అయిపోయారు. ఇక, రేపో మాపో పార్టీ మారాలని, అది వైసీపీనా.. టీడీపీనా.. అని ఆలోచిస్తున్న సమయంలో కాంగ్రెస్ తిరిగి ఆయనను తన చెంతకు తెప్పిం చుకుంది.
ఈ క్రమంలోనే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కన్నా కూడా ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకుని కేంద్రంలో కీలకమైన బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. కిరణ్ కూడా వచ్చే ఎన్నికల్లో లోకల్ కన్నా కేంద్రంలోనే పని చేయాలని భావిస్తున్నారు. దీనికితోడు తాను ప్రాతినిధ్యం వహించిన పీలేరు నియోజకవర్గంలో టీడీపీ తరఫున బరిలోకి దిగేందుకు ఆయన సోదరుడు సతీష్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన కు నామినేటెడ్ పదవి ఇచ్చినా.. ఎన్నికల నాటికి ఆయనకు టీడీపీ తరఫున పీలేరు టికెట్ ఖాయమని తెలుస్తోంది. ఈ క్రమంలో తాను కాంగ్రెస్ తరఫున పీలేరు నుంచి టికెట్ సంపాయిచుకున్నా.. సొంత తమ్ముడిపై పోరు చేయడం కిరణ్కు సుతరాము ఇష్టం లేదు. ఈ క్రమంలో ఎంపీగా పోటీ చేయడమే బెటరని ఆయన అనుకుంటున్నారు.
అయితే, చిత్తూరు జిల్లాలోని రెండు ఎంపీ నియోజకవర్గాలు చిత్తూరు, తిరుపతి కూడాఎస్సీలకు రిజర్వ్ చేసి ఉండడం తో కిరణ్ ఎక్కడ నుంచి ఎంపీ గా పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయనకు విజయం చేకూర్చి పెట్టడాన్ని బాధ్యతగా తీసుకుంటున్న కాంగ్రెస్ ఎలాగైనా ఆయనను గెలిపించుకుని తీరాలనే పట్టుదలతో ఉంది. ఇక, నెల్లూరు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక్కడ రెడ్డి సామాజిక వర్గంతోపాటు .. కాంగ్రెస్ సానుభూతి పరులు ఎక్కువగా ఉన్నారు. దీనికితోడు టీడీపీకి ఇక్కడ బలం తక్కువగా ఉంది. వైసీపీ తరఫున మేకపాటి రాజమోహన్ రెడ్డి తిరిగి ఇక్కడ నుంచి పోటీ చేసినా.. కిరణ్ బరిలోకి దిగితే.. ఆయనకు గట్టి పోటీ ఇస్తారని మెజారిటీ తగ్గినా.. మాజీ సీఎంను ఇక్కడి ప్రజలు గెలిపించే అవకాశం ఉంటుందని లెక్కలు కడుతున్నారు. మరి కిరణ్ ఎలాంటి ఆలోచన చేస్తున్నారో చూడాలి.