ఏపీలో ఎన్నికలు ముగిశాయి. అధికారం తమదంటే తమదేనని టీడీపీ, వైసీపీలు చెబుతున్నాయి. ఎవరికి వారు అంకెల గారడీలతో ఏపీ ప్రజల్లో చర్చలకు తెరదీశారు. ఇంత వరకు బాగానే ఉంది. ఇక, ఎన్నికలకు ముందు టీడీపీ చేసిన ప్రచా రం గురించి ఇక్కడ ప్రస్థావించుకోవాలి. జగన్కు పాలించే అర్హత లేదని, ఆయనకు ఎలాంటి అనుభవం లేదని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అదేసమయంలో ప్రస్తుతం ఏపీ సంధి దశలో ఉందని, అనేక ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని. ఇప్పుడు ఏపీకి పాలనాదక్షుడు కావాలని ఆయన తెగ చెప్పారు. ఇక, బాబు నోటి నుంచి జాలువా రిన ఈ వ్యాఖ్యలకు మరింత మసాలా జోడించి ఆయన అనుకూల మీడియా తెగ కథనాలపై కథనాలను వండి వార్చింది.
ఏపీకి అనుభవం ఉన్న నాయకుడే కావాలని, లేకుంటే అంతే! అని ప్రత్యేకంగా పేజీలకు పేజీలు కథనాలను వండిన ఈ పత్రికల కథలతో జనాలకు పిచ్చిపట్టినంత పనైంది. అయినప్పటికీ.. మార్పు దిశగా ఏపీ ప్రజలు అడుగులు వేశారని అ న్ని సర్వేలు చెబుతున్నాయి. అంతేకాదు, ఒక్క చాన్స్ ఇస్తే. పోయేదేముంది? అని కూడా ప్రజలు అనుకున్నట్టు ఎన్నిక లకు ముందు, తర్వాత కూడా అనేక సర్వేలు చెప్పాయి. పోలింగ్ నాడు కూడా ఇదే తరహా భరోసా వైసీపీలో కనిపించింది. తాము గెలిచి తీరుతామని వైసీపీ అధినేత జగన్ చెప్పారు. ఒకవేళ నిజంగానే రేపు జగన్ వస్తే ఏమవుతుంది? చంద్రబాబు చెప్పినట్టే అనుభవం లేని జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా వదిలేస్తారా? ఏపీని మరో పదేళ్ల పతనానికి తీసుకు పోతారా? ఇప్పుడు ఈ ప్రశ్నలపై కూడా మేధావులు దృష్టి పెట్టారు.
సర్వత్రా జగన్ జపం జరుగుతున్న సమయంలో ఈ కీలక అంశంపై దృష్టి పెట్టిన మేధావులకు జగన్ పాలనా దక్షతపై రెండు మూడు ఉదాహరణలు లభించాయి. ఆయనలోని విజన్, దూరదృష్టి, ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకోవడం, ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా తట్టుకునే లక్షణాలను ఆయన పుంజుకోవడం, ఆర్థికంగా నిలదొక్కుకోవడం, ప్రచారాలకు , ఆర్భాటాలకు దూరంగా ఉండడం వంటివి కనిపించాయని వారు అంటున్నారు. ప్రస్తుతం జగన్ చేతిలో పెద్ద వ్యాపార సామాజ్యమే ఉంది. వీటిలో సాక్షి మీడియా పైకి కనిపిస్తోంది. కానీ, వీటిని మించి ఆయనకు భారతీ సిమెంట్స్, భారతీ ఇన్ ఫ్రా, మైనింగ్ సహా అనేక సంస్థలు నిర్వహిస్తున్నాయి.
నిజానికి..జగన్పై కాంగ్రెస్ ప్రభుత్వ హయాలో నమోదైన కేసుల నేపథ్యంలో ఆయా వ్యాపార సామ్రాజ్యాలు కుప్పకూలు తాయని అందరూ భావించారు. 2017లో సాక్షి మీడియా సంస్థను మూసివేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రయత్నించారు. ఇక, భారతి సిమెంట్కు సంబంధించిన లేటరైట్ గనుల లీజును కూడా ఆయన రద్దు చేసి ఈ సంస్థను కూడా పతనం చేయాలని బావించారు. మరోపక్క, సీబీఐ, ఈడీ ఆస్తులను జప్తు చేశాయి. ఇన్ని ఎదురు దెబ్బలు ఎదురైనా.. కూడా జగన్ ఎక్కడా తొణకలేదు. బెణకలేదు. ఆయా సంస్థలను విజయ పథంలో నడిపిస్తున్నారు. ఆర్థికంగా కొద్దిపాటి ఒడిదుడుకులు ఎదురైనా.. సంస్థలను నడిపిస్తున్నారు.
ఉద్యోగులకు సక్రమంగా వేతనాలు చెల్లిస్తూనే ఉన్నారు. ఇది ఒకపక్క ఆయనలోని పాలనాదక్షతను చూపిస్తోంది. మరోపక్క, రాజకీయంగా పార్టీని స్థాపించిన జగన్కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ ఎదురైంది. 2012లో ఉప ఎన్నికల్లో భారీ విజయంఅనంతరం ఆయనను కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వివిధ కేసులతో 16 నెలలు జైలుకు పంపింది. దీంతో ఇంకేముంది పార్టీ జెండా పీకేస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. నిజానికి చాలా చిన్న వయసు కూడా కావడంతో జగన్ ఇక చేతులు ఎత్తేస్తారని అనుకున్నారు. కానీ, ఆయన తన వ్యూహాలను జైలు నుంచే నడిపించారు. పార్టీని నిలబెట్టారు. గత ఎన్నికల్లో 67 స్థానాలు గెలుచుకున్నారు.
అయినప్పటికీ.. నిద్రపోని చంద్రబాబు.. జగన్ పార్టీలో గెలిచిన 23 మందిని లాగేసుకున్నారు. ఇది కూడా పెద్ద దెబ్బేనని, ఇక, జగన్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ, ఆయన గోడకు తగిలిన బంతిలా తిరిగి లేచారు. ఇప్పుడు సీఎం సీటును అందుకునేందుకు దూసుకుపోతున్నారు. సో.. ఇవన్నీ కూడా ఆయనలోని పాలనా దక్షతకు నిదర్శనాలేనని అంటున్నారు పరిశీలకులు.