తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. నగరాల్లోని బస్సులు మాత్రం ఇప్పట్లో తిరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో నగరాల్లో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు విధులకు తప్పనిసరిగా హాజరకావాల్సి రావడంతో వేసవిలో తిప్పలు తప్పడం లేదు.
లాక్డౌన్తో దాదాపు రెండు నెలల పాటు బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే పర్మీషన్ రావడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు ఒక్కసారిగా పోటెత్తారు ప్రయాణీకులు. కొన్ని చోట్ల ప్రత్యేకంగా నాన్స్టాప్ సర్వీసులను ఏర్పాటు చేశారు.
కానీ సిటీ బస్సులు మాత్రం ఇంకా తిరగడం లేదు.రోజూ వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులకు ఇవే ప్రయాణ సాధనాలు. ప్రస్తుతం కరోనా కారణంగా బస్సు సర్వీసులు నిలిపేశారు. సిటీ బస్సులు తిరక్కపోవడంతో ఉద్యోగులు నానా పాట్లు పడుతున్నారు.
ఇక రీజీయన్లో ప్రాంతాల్లో బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఏపీలో అయితే ఆన్లైన్ లో టిక్కట్లు బుక్ చేసుకోవాలి. కేవలం డిపోల వద్దే ప్రయాణికులు ఎక్కాలి. మధ్యలో ఎక్కడా ప్రయాణికుల్ని అనుమతించరు. మరోవైపు వృద్ధులు.. పదేళ్ల లోపు పిల్లల్ని అత్యవసరమైతే తప్ప అనుమతించడం లేదు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకే బస్సులు తిరుగుతున్నాయి.
ఒక బస్సులో సుమారు 20 మంది వరకు ప్రయాణించే అవకాశం ఉంది. జిల్లా నుంచి ఇతర జిల్లాలకు వెళ్లే ప్రయాణీకుని దగ్గర తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. మాస్క్ ధరించాలి. థర్మల్ స్కాన్ తర్వాతే వారిని అనుమతిస్తున్నారు. అయితే ఆంక్షలతో సిటీ పరిధిలో కూడా సర్వీసులను తిప్పాలని కోరుతున్నారు ఉద్యోగులు.
మొత్తానికి కరోనా ప్రభావంతో నాలుగో దశ లాక్ డౌన్ కొనసాగుతోంది. సగటు మానవుని ఆర్థిక స్థితిగతులు దిగజారి పోవడంతో పలు రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని సడలింపులు ఇచ్చాయి. అందులో భాగంగానే బస్సు సర్వీసులను కల్పించాయి. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులను సైతం మెరుగుపరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అయితే కరోనా ప్రభావిత ప్రాంతాల్లో బస్సు సర్వీసులను నిలిపివేశాయి.