ఏడాదిన్నర క్రితం తెలుగు సినిమా పరిశ్రమను బెంబేలెత్తించిన డ్రగ్స్‌ కలకలం.. మరోసారి వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా లీలలు వెలుగుచూశాయి. ఈ కేసులో అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తి అరెస్ట్ అయింది. ఎన్సీబీ విచారణలో ఆమె, చాలామంది నటుల పేర్లు చెప్పినట్టు తెలుస్తోంది. అందులో బాలీవుడ్‌ బ్యూటీ సారా అలీఖాన్‌తో పాటు, టాలీవుడ్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ పేరు కూడా ఉండడం కలకలం రేపుతోంది.

సుశాంత్‌ మృతితో బయటపడిన ఈ డ్రగ్స్‌ కుంభకోణం బాలీవుడ్‌నే కాదు.. ఇప్పుడు టాలీవుడ్‌కు పాకినట్టు కనిపిస్తోంది. రియా నుంచి సేకరించిన వివరాల ఆధారంగా.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసులో సంబంధం ఉన్న సుమారు 25 మంది నటీనటుల లిస్టును సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ర‌కుల్ ప్రీత్ సింగ్, సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్.. త‌న‌‌తో క‌లిసి డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు రియా అధికారులకు చెప్పినట్టు తెలిసింది. వీరితో పాటు ఫ్యాష‌న్ డిజైన‌ర్ సిమోన్ ఖంభ‌ట్ట పేరు కూడా ఎన్సీబీ విచార‌ణ‌లో రియా చెప్పింది. రకుల్‌, సిమోన్లతో ఫోన్ లో రియా టచ్‌లోనే ఉన్నట్టు.. కాల్‌డేటా ఆధారంగా నిర్ధారించారు అధికారులు.

డ్రగ్స్ వ్యవహారంలో ర‌కుల్ ప్రీత్ సింగ్‌ పేరు బయటకు రావడం... తెలుగు ఇండస్ట్రీని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. అంద‌రినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ప్రస్తుతం ర‌కుల్.. ఓ సినిమా షూటింగ్ కోసం మూడు రోజుల ముందు హైద‌రాబాద్‌కు వ‌చ్చింది. వికారాబాద్‌లో షూటింగ్ నిర్వహిస్తుండగా.. ఆమె అర్థాంత‌రంగా వెళ్లిపోయింది. అందుకు కార‌ణం డ్రగ్స్ కేసులో త‌న పేరు ఉండ‌డ‌మేనని తెలుస్తోంది. డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ర‌కుల్ పేరు మారుమోగుతుండ‌టంతో షూటింగ్‌ను ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

గతంలో తెలుగు సినిమాను డ్రగ్స్‌ వ్యవహారం ఓ కుదుపు కుదిపేసింది. చాలామంది ప్రముఖుల పేర్లు వినిపించాయి. కొందరు విచారణను కూడా ఎదుర్కొన్నారు. అయితే, కొన్నాళ్ల పాటు హాట్‌హాట్‌గా నడిచిన ఈ వ్యవహారం తర్వాత చల్లబడిపోయింది. ఏం జరిగిందో తెలియదు.. విషయం అటకెక్కింది. అంతా మర్చిపోయారు. ఇన్నాళ్ల తర్వాత మళ్లీ డ్రగ్స్‌ ఇష్యూ టాలీవుడ్ వినిపించడం కలకలం రేపుతోంది. రియాతో రకుల్‌ కలిసి ఉన్న వీడియోలు, ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఈ కేసులో ఆమెకు కూడా సంబంధం ఉండి ఉంటుందనే గుసగుసలు మొదలయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: