రాష్ట్రంలో పరిషత్ ఓట్ల లెక్కింపు సమయంలో జరిగిన సంఘటనలు కూడా.. ఈసారి ప్రజలు ఫలితాలపై అంతగా ఆసక్తి చూపకపోవడానికి కారణమని తెలుస్తోంది. కరోనా నిబంధనలను అనుసరించి, ఏజెంట్స్కు కరోనా పాజిటివ్ వస్తే వారిని కౌంటింగ్ కేంద్రాల దగ్గర నుంచి పంపేశారు. ఆ స్థానంలో కొత్తగా మరో వ్యక్తికి కరోనా టెస్టులు నిర్వహించి, వారిని ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించారు. అయితే, ఆ వ్యక్తులపై ఎలాంటి కేసులు లేకుండా.. వారి ట్రాక్ రికార్డును కూడా చెక్ చేసిన తర్వాతే, ఏజెంట్స్ గా అనుమతించారు. కొన్ని కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఈ కార్యక్రమం మొత్తం అయ్యే సరికి.. ఓట్ల లెక్కింపు ప్రారంభించడం ఆలస్యమైంది.
ఇక ఏంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగి చాలా రోజులు కావడంతో పాటు ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ ఈ ఎన్నికలను బహిష్కరించడం కూడా.. పరిషత్ ఫలితాలపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేకపోవడానికి కారణం కావచ్చనే చర్చ జరుగుతోంది. ఓట్ల కౌంటింగ్ ఎప్పుడు జరిగినా ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయనే ప్రచారం ముందు నుంచే జరిగింది. దీంతో ఈసారి ఎన్నికలు కూడా పెద్ద రసవత్తరంగా జరగలేదు. మెజార్టీ స్థానాల్లో పోటీ కూడా బలంగా లేకపోవడంతో.. అధికార పార్టీ బలపరిచిన అభ్యర్ధులే ఎక్కువ చోట్ల గెలుస్తారని అందరూ ముందు నుంచే లెక్కలేసుకున్నారు. దీంతో ఈసారి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదన్న చర్చ జోరుగా జరుగుతోంది.