విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రాజకీయాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. “ఇక్కడ ఏం జరుగుతోంది? ఎవరు ముందుకు వస్తున్నారు? ఎవరు నాయకత్వం వహిస్తున్నారు?” అనే ప్రశ్నలతో స్థానికులు తల పట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రముఖ పారిశ్రామికవేత్త, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఘన విజయం సాధించారు. ఆరంభంలో చిన్న పనులు, అభివృద్ధి చర్యలు మొదలుపెట్టినా.. అనుకోని యాక్సిడెంట్ తర్వాత ఆయన పూర్తిగా హైదరాబాద్‌కే పరిమితమైపోయారు. దాదాపు ఆరునెలలుగా ఆయన నియోజకవర్గంలో కనిపించకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. “మన ఎమ్మెల్యే ఎక్కడ?” అన్న ప్రశ్న ప్రతీ ఇంట్లో వినిపిస్తోంది.


కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం చంద్రబాబు అన్ని నియోజకవర్గాల్లో సుపరిపాలనలో తొలి అడుగు, తల్లికి వందనం వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కానీ విజయవాడ వెస్ట్‌లో మాత్రం ఈ కార్యక్రమాలు కనిపించకపోవడం ఆశ్చర్యంగా మారింది. బీజేపీ నుంచి ఎవరూ ముందుకు రాకపోవడం, స్థానిక నేతలంతా సైలెంట్‌గా ఉండిపోవడం ప్రజల్లో నిరాశను పెంచుతోంది. ఇక మరోవైపు, బీజేపీకి ఈ నియోజకవర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా మార్వాడీలు, బ్రాహ్మణ వర్గం బీజేపీకి అండగా ఉంటాయి. అలాంటిది పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి బీజేపీ నేతలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం లేదని స్థానికంగా చర్చ మొదలైంది. “ఎమ్మెల్యే లేకపోయినా పార్టీ తరఫున ఎవరో ముందుకు వచ్చి కార్యక్రమాలు నిర్వహించలేరా ? ప్రజల సమస్యలు పరిష్కరించలేరా ? ” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.



టీడీపీ విషయానికి వస్తే, గతంలో బుద్ధ వెంకన్న, జలీల్ ఖాన్ వంటి వారు మీడియా ముందు తరచూ గళం వినిపించేవారు. కానీ ఇప్పుడు పదవుల పంచాయతీ, ప్రాధాన్యత లభించకపోవడం వంటి కారణాలతో ఆ నేతలు సైలెంట్ అయిపోయారు. దీంతో టిడిపి వైపు నుంచి కూడా ఎటువంటి శబ్దం వినిపించకపోవడం స్థానికంగా గందరగోళానికి దారితీస్తోంది. మొత్తం మీద విజయవాడ వెస్ట్‌లో రాజకీయాలు “గుడ్డివాడి ముక్కుతో గాలిని అంచనా” వేసేలా మారాయి. కూటమి ప్రభావం, బీజేపీ అసమర్ధత, టిడిపి నేతల నిరుత్సాహం — అన్నీ కలగలిపి ప్రజలను అసంతృప్తిలోకి నెట్టేశాయి. ఇక ముందు ముందు ఈ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: