ప్ర‌తి మ‌నిషి జీవితంలో ఫీడ్‌బ్యాక్‌ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చే ఫీడ్‌బ్యాక్‌కు అనుగుణంగానే ఎవ‌రైనా పని చేయాల్సి ఉంటుంది. అయితే వైసీపీ మాత్రం ఇలాంటి ఫీడ్‌బ్యాక్‌ను పట్టించుకోవడంలో విఫలమవుతోంది. ఒకప్పుడు టీడీపీ, జనసేన కలిసి పని చేసిన సందర్భంలో బీజేపీ ఆ కూటమిలో లేనే లేదు. అప్పట్లో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతో, వైసీపీ సహకరించడం వల్ల పెద్ద సమస్య తలెత్తలేదు. కానీ అదే సమయంలో టీడీపీ, జనసేన కూటమితో వైసీపీ ఢీ అంటే ఢీ అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది. ఫలితంగా ఆ పార్టీ క్యాడర్ బీజేపీని పూర్తిగా శత్రువుగా భావించారు. అలాంటి సమయంలో మళ్లీ బీజేపీతో వైసీపీ సాన్నిహిత్యం పెంచుకోవడం చాలా మంది కార్యకర్తలకు జీర్ణించుకోవడం కష్టమవుతోంది. ముఖ్యంగా ముస్లింలు, దళితులు దీనిపై సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినా పార్టీ నాయకత్వం వారి అభిప్రాయాలను పట్టించుకోవడం లేదు.


ప్రస్తుతం వైసీపీ నిర్ణయాలు మొత్తం జగన్ వ్యక్తిగత ప్రయోజనాలకే కేంద్రీకృతమై ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పార్టీ అనేది ఆయన కోసం మాత్రమేనన్న భావన క్యాడర్‌లో బలపడుతోంది. జగన్ వెనుక ఉన్నవారు ఆయన ఆదేశాలను అంధంగా పాటిస్తున్నారని, అంతకంటే విభిన్నమైన ఆలోచనకు అవకాశం లేదనే చెప్పాలి. ఈ కార‌ణంగానే క్రమంగా క్యాడర్ నమ్మకం కోల్పోతుంది. ఏదో ఒక సమయంలో వారు పూర్తిగా విసుగుచెందే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. ఇదే సమయంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ విష‌యాన్ని చాలా మంది ప్ర‌స్తావిస్తున్నారు.
లాలూ ముస్లింలు, దళితుల మద్దతు కోల్పోకుండా ఉండటానికి ఎప్పుడూ బీజేపీతో రాజీ పడలేదు. జైలుకు వెళ్లాల్సి వచ్చినా తన సిద్ధాంతాలను వదులుకోలేదు. ఫలితంగా ఆయన పార్టీ ఇప్పటికీ బతికే ఉంది. కానీ జగన్ రెడ్డి మాత్రం తన ఓటు బ్యాంక్‌ను ప్ర‌మాదంలోకి నెట్టేస్తూ బీజేపీకి దగ్గరవుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.


రాజకీయ పార్టీలకు ప్రజల విశ్వాసం అనేది ప్రాణాధారం. ఒకసారి ఆ విశ్వాసం దెబ్బతింటే పార్టీ పునాదులే కదలిపోతాయి. ప్రస్తుతం వైసీపీ అదే దిశగా వెళ్తోందనే భావన కనిపిస్తోంది. కాబట్టి ఫీడ్‌బ్యాక్‌ను పట్టించుకుని, క్యాడర్ అభిప్రాయాలను గౌరవించి, ప్రజల ఆవేదనకు స్పందిస్తేనే వైసీపీ తనను తాను నిలబెట్టుకోగలదు. లేకపోతే పార్టీ భవిష్యత్తు మరింత కష్టాల్లో పడే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: