అసెంబ్లీలో అధికార వైకాపా దూకుడు కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది . సాగునీటి ప్రాజెక్టుల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన పొరపాట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎత్తిచూపారు . ఇక అసెంబ్లీ సమావేశాల్లో విపక్ష తెలుగుదేశం పై విరుచుకు పడేందుకు వైకాపా తను అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నట్లు స్పష్టం అవుతోంది .
సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు అంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎటువంటి ప్రశ్నలు సంధిస్తుందోనన్న ఆందోళన అధికార పార్టీలో ఉండడం సహజం. కానీ దానికి భిన్నంగా ఏదైనా అంశంపై చర్చించేందుకు సిద్ధం అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , విపక్షానికి సవాల్ విసురుతున్నారు. ఇప్పటికే తాను సిద్ధం చేసిన 23 అంశాలనే కాకుండా, ఇతర అంశాలపై కూడా చర్చించేందుకు రెడీ అని ఆయన ప్రకటించారు . టీడీపీ నోటీసులిచ్చే ఏ అంశాన్ని అయినా , ఎంత సమయం తీసుకోనైన చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు .
సభ లో తాము ఏదైనా అంశాన్ని లేవనెత్తితే అధికారపక్షం నో అంటుందో ... అదే విషయాన్ని పట్టుకుని రచ్చ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలన్న టీడీపీ వ్యూహాన్ని జగన్మోహన్ రెడ్డి చతురత తో తిప్పికొట్టారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . అసెంబ్లీ లో ఏ అంశం పైన అయినా చర్చించేందుకు రెడీ అంటూ సభానాయకుడు ముందుకు రావడంతో , తెలుగుదేశం పార్టీ కి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది .