మహారాష్ట్ర,
హర్యానా రాష్ట్రాలతో పాటుగా దేశంలో 54 అసెంబ్లీ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. అందులో తెలంగాణలోని హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఒకటి. హుజూర్ నగర్లో కాంగ్రెస్ పార్టీ.. తెరాస పార్టీల మధ్య హోరాహోరీ పోటీ జరిగినట్టుగా తెలుస్తోంది. హుజూర్ నగర్ నియోజక వర్గాన్ని 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఉత్తమ్
కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధిచడంతో.. హుజూర్ నగర్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగాల్సి వచ్చింది.
కాగా, ఈ ఉపఎన్నికను తెరాస పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. ఎలాగైనా అక్కడ విజయం సాధించాలని అనుకుంది. 2009 నుంచి ఉత్తమ్
కుమార్ రెడ్డి అక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. ఆ నియోజక వర్గాన్ని చాలా వరకు ఆయన అభివృద్ధి చేశారు. ఈనెల మొదటి వరకు తెరాస పార్టీకి అనుకూలంగా ఉన్నది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటె.. ఉప ఎన్నికల్లో దాదాపుగా ఆ పార్టీనే విజయం సాధిస్తుంది. తెరాస అభ్యర్థి సైదా రెడ్డి విజయం ఖాయం అనుకున్నారు.
అయితే, అక్టోబర్ 5 వ తేదీ నుంచి
ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. సమ్మెకు దిగడంతో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. రోజు రోజుకు సమ్మె ఉదృతంగా మారిపోయింది. అంతేకాదు, సమ్మె చేస్తున్న కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ పేరుతో తొలగించేశారు. ఇది పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. కార్మికులు ఎప్పుడైతే బయటకు వచ్చి సమ్మె చేయడం మొదలుపెట్టారో.. అప్పటి నుంచి మెల్లిగా ఒక్కొక్కరు వాళ్లతో కలవడం మొదలైంది. రెవిన్యూ, ఉద్యోగ, విద్యార్థి, ప్రజా, రాజకీయ సంఘాలు, వివిధ పార్టీలు సమ్మెకు మద్దతు ఇస్తున్నాయి.
ఈ సమయంలో జరిగిన ఉప ఎన్నిక కావడంతో అందరిలోనూ ఉత్కంఠత మొదలైంది. హుజూర్ నగర్ లో దాదాపుగా 85శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం దేనికి సంకేతంగా చెప్పాలి. ఎలా దీన్ని ట్రీట్ చేయాలి. హుజూర్ నగర్లో తెరాస పార్టీ గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కానీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం ధీమా ఉన్నది. గెలుపు తమదే అని చెప్తున్నది. ఎవరు గెలుస్తారు.. ఏంటి అనే విషయాలు తెలియాలంటే అక్టోబర్ 24 వరకు ఆగాల్సిందే.