భారత్ చైనా మధ్య సంఘర్షణల విషయంలో పాకిస్థాన్ తన మీడియా జోక్యం చేసుకుని భారత్ పై విషం చిమ్మటం ప్రారంభించింది. అలా వ్యవహరించటం పాకిస్థాన్ సహజ ధోరణి మాత్రమే. సోమవారం చైనా రాకెట్లతో సిక్కిం సరిహద్దులో దాడి చేసిందని ఫలితంగా 158 మంది భారత జవానులు మరణించారని చెప్పింది. ఈ ఘటనలో 158 మంది భారత జవానులు అమరులయ్యారని తెలిపింది.
పాక్ మీడియాలో వస్తున్న కథనంపై స్పందించిన భారత విదేశాంగ శాఖ అవన్నీ నిరాధారమైన ఆరోపణలని పేర్కొంది. రెండు పొరుగు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయం లో మరో దేశ మీడియా ఇలాంటి వార్తలను ప్రచురించడం గర్హనీయమని మండిపడింది. అంతే కాదు ఎలాంటి భాధ్యత లేని పాక్ మీడియాకున్న అవలక్షణమే ఇదని స్పందించింది.
దీనిపై మాట్లాడిన భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి గోపాల్ బాగ్లే, ఇలాంటి కథనాలను బాధ్యత గల మీడియా ప్రచురించదని అన్నారు. భారత్పై దుష్ప్రచారం చేసేందుకే పాకిస్తానీ మీడియా ఇలాంటి అవాస్తవ కథనాల ను వండుతోందని వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ కథనాలన్నీ అధార రహితాలనీ కుట్ర కుతంత్రాలతో కూడిన తప్పుడు కథనాలని భారత్ తిప్పికొట్టింది. చైనాతో సిక్కిం సరిహద్దులో వివాదం ఉన్న సమయంలో పాకిస్తాన్ మీడియా ఈ వార్తను ప్రచురించడంతో అది వైరల్గా మారింది.