ప్రపంచంలో ఇప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించే చర్చలు జరుగుతున్నాయి. ఒకరు అమెరికా అధ్యక్షులు డోనాల్డ్ ట్రంప్ మరొకరు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఇద్దరూ ఇద్దరే..మొండిఘటాలు..ఎవరి మాట లెక్కచేయరు. దీంతో వీరిద్దరి గొడవ చిలికి చిలికి గాలి వాన అవుతూ..మూడో ప్రపంచ యుద్దానికి దారి తీస్తుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. కాగా ఈ మద్య మరో కొత్త వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ను చంపేస్తారా..? కిమ్ ను హతమార్చేందుకు ప్లాన్ రెడీ అయ్యిందా...? అందుకు తగ్గట్లు బలగాలను మోహరిస్తున్నారా...? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది.
అగ్రరాజ్యంగా తమ హూంకరింపుల్ని లెక్కచేయకుండా కూరలో కరివేపాకును ఏరిపారేసినట్లు తమను తీసిపారేస్తున్న ఉత్తరకొరియాను కాళ్లబేరానికి తీసుకురావాలంటే ఇదొక్కటే మార్గమన్నది అమెరికా మాట.అమెరికా అణ్వాయుధ సామర్థ్యం కలిగిన సబ్ మెరైన్ ను దక్షిణకొరియా తీరానికి తరలించింది. అణ్వాయుధాలు కూడా అక్కడకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే యుద్ధవిన్యాసాలు జరుగుతున్నందున సబ్ మెరైన్ అక్కడకు చేరుకోవడంలో వింత లేదు.
అయితే దీంతో పాటు నేవీ సీల్స్ కూడా అక్కడకు చేరుకున్నారని చెబుతున్నారు.నేవీ సీల్స్ ను స్పెషల్ ఆపరేషన్లకు మాత్రమే వాడతారు. అత్యాధునిక ఆయుధాలు ధరించి దేనికైనా సిద్ధమయ్యే మెరికల్లాంటి కమెండోలే ఈ సీల్స్. పాక్ లో తలదాచుకున్న అల్ ఖైదా అగ్రనేత లాడెన్ ను చంపింది వీళ్లే. ఎంత నిశ్శబ్ధంగా వస్తాయో అంతే నిశ్శబ్ధంగా పనికానిచ్చేస్తాయి ఈ దళాలు. ఇప్పుడు వాటినే దక్షిణకొరియా తీరానికి తరలించినట్లు భావిస్తున్నారు.లాడెన్ ను చంపడం వేరు. కిమ్ ను చంపడం వేరు. లాడెన్ హత్యకు పరోక్షంగా పాక్ సహకరించింది.
ఇక్కడ ఓ దేశ అధ్యక్షుడి నివాసంపై దాడి చేసి ఆయన్ను హతమార్చడం అంటే మామూలు విషయం కాదు. పైగా కిమ్ ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదు. తెలిసినా ఆ దేశ సైన్యాన్ని దాటుకుని ముందుకెళ్లడానికి ఎన్నోగట్స్ కావాలి. కానీ గతంలో కొంతమంది దేశాధ్యక్షుల్ని చంపించిన ఘనత సీఐఏకు ఉంది. అందుకే అందరికీ ఇన్ని అనుమానాలు. కానీ అమెరికాకు ఓ భయమూ ఉంది. ఏ మాత్రం తేడావచ్చి కిమ్ దొరక్కపోయినా.... మరుక్షణం తమ భూభాగంపై అణుదాడి జరగొచ్చు. ఎందుకంటే అణురిమోట్ ఆ పిచ్చోడి చేతిలోనే ఉంది.