తెలంగాణలో హరితహరం, అడవుల పరిరక్షణ, గిరిజనుల హక్కుల అంశం ఊహించని మలుపులు తిరుగుతోంది. హరితహారం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మొక్కలు నాటుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే ప్రభుత్వ స్థలాలతో పాటుగా పోడు భూముల్లోనూ మొక్కలను పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇలా ముందడుగు వేసిన సమయంలోనే, ఇటీవల కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎమ్మెల్యే తమ్ముడు ఓ మహిళా అధికారిని దారుణంగా కొట్టడం తీవ్ర చర్చకు కారణమైంది. ఈ వివాదం సద్దుమణుగుతున్న తరుణంలోనే బీజేపీ ఎంపీ సోయం బాపురావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు ఫారెస్ట్ అధికారులు వస్తే తరమికొట్టాలని పిలుపునిచ్చారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన సోయం బాపురావు తాజాగా తన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హరితహారం పేరుతో తమ జోలికొస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పోడు భూముల్లో ఎవరైనా మొక్కలు నాటితే పీకేయాలన్నారు. మొక్కలను పీకేస్తే ఎవరేం చేస్తారో తాను చూసుకుంటానని.. ప్రజలెవరూ భయపడొద్దని సూచించారు. ఆదివాసీల హక్కుల కోసం డిసెంబర్ 9న ఢిల్లీలో ధర్నా చేయబోతున్నామని ఆయన తెలిపారు. పదవుల్లో ఉన్నా పోరాటం ఆపేది లేదని బాపురావు స్పష్టం చేశారు. పోడు భూముల్లో మొక్కలు నాటేందుకు వచ్చే అటవీ శాఖ అధికారులను తరిమికొట్టాలని బీజేపీ ఎంపీ సోయం బాపురావు సూచించడం సంచలనంగా మారింది.