టీడీపీ దారుణమైన ఓటమి దెబ్బకి ఆ పార్టీ విలువ అత్యంత దారుణంగా పడిపోయిందనేది ఎవరూ కాదనలేని నిజం. బాబు టీడీపీ బలాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నా.. టీడీపీకి ఎదురు దెబ్బలు విపరీతంగా తగులుతూనే ఉన్నాయి. ఇన్నాళ్లు పార్టీకి అండగా బలమైన ఆర్ధిక శక్తులుగా ఉన్న నాయకులు ఇప్పటికే బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. స్వతహాగా జన బలం ఉన్న నేతలు టీడీపీకి అలాగే బాబుకి కూడా దూరంగా ఉంటున్నారు. ఇక ఓడిపోయిన టీడీపీ నేతలు కూడా బీజేపీలో చేరిపోయారు. అయితే ఈ వలసలను గత కొన్ని రోజులుగా బాబు సమర్ధవంతంగా ఆపగలిగారు. లేకపోతే కాపు నాయకులు ఎప్పుడో తమ జెండాని ఎజెండాని మార్చుకునే వారు. కానీ బాబు అడుగులను ఆలోచనలను గమనించిన బీజేపీ అగ్రనాయకత్వం, కొత్త వ్యూహాలను అమలు పరుస్తోంది. దాంతో బాబుకి మళ్ళీ చెడ్డ రోజులు వచ్చినట్లే భావించాలి.
ముఖ్యంగా టీడీపీ కాపు నాయకులు బీజేపీలోకి వెళ్ళటం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ ప్రధానంగా మాజీ మంత్రి గంట శ్రీనివాసరావును అలాగే విజయనగరంకి చెందిన పలువురు కాపు నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి ముమ్మరంగా ప్రయత్నిస్తోంది. గత కొంత కాలంగా టీడీపీ కాపు నాయకులు చాలా సైలెంట్ గా ఉంటున్నారు. దీనికి కారణం పార్టీ మారే యోచనలో వాళ్ళు ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆందరూ అధికార ప్రతిపక్ష నేతలు ఒకరినొకరు తీవ్రమైన విమర్శలు చేసుకుంటున్నప్పటికీ.. గంటా లాంటి నాయకులు కనీసం వైసీపీ నేతలను పల్లెత్తు మాట అనడంలేదు. మొత్తానికి బీజేపీ టీడీపీని నాశనం చేసేదాకా వదిలేలా లేదు.