ఐపీఎల్ 2025 సీజన్ ఉత్కంఠభరితంగా ముగిసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తొలిసారిగా ట్రోఫీ అందుకుంటూ చరిత్ర సృష్టించగా, ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. గత 18 ఏళ్లుగా టైటిల్ కోసం ఎదురు చూస్తున్న పంజాబ్ జట్టు, ఈ సారి ఫైనల్ వరకు వచ్చినా కేవలం 6 పరుగుల తేడాతో ఓటమిపాలవడం తట్టుకోలేని విషాదాన్ని మిగిల్చింది. అయినా వారు చూపిన పోరాటం, ఆటపట్ల చూపిన అంకితభావం మాత్రం అభిమానులను గర్వపడేలా చేసింది.

ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన RCB 190 పరుగులు చేసింది. ప్రత్యుత్తరంగా బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ విజయానికి కృషి చేసింది. ప్రియాన్షు ఆర్య (24), జోష్ ఇంగ్లిస్ (39), శశాంక్ సింగ్ (61 నాటౌట్) వంటి ఆటగాళ్లు సమర్థవంతంగా ఆడినా, చివరి ఓవర్లలో వికెట్లు చేజారిపోవడం వల్ల విజయాన్ని అందుకోలేకపోయారు. ముఖ్యంగా ఆఖరి వరకూ పోరాడిన శశాంక్ సింగ్ మెరుగైన ఇన్నింగ్స్ ఆడినా మద్దతుగా బ్యాటర్లు నిలవకపోవడం వల్ల 184 పరుగులకే జట్టు పరిమితమైంది.

ఈ సీజన్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వం పంజాబ్ కింగ్స్‌కు కీలక బలంగా నిలిచింది. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లిన అనుభవాన్ని ఈసారి పంజాబ్‌కోసం ఉపయోగించాడు. ఆయన దూకుడు స్వభావం, ఒత్తిడిలో సైతం చక్కటి నిర్ణయాలు తీసుకునే సత్తా, జట్టుకు సమతుల్యత ఇచ్చాయి. ముంబైపై క్వాలిఫయర్-2లో 87 పరుగులతో నాటౌట్ గా నిలిచిన ఇన్నింగ్స్ అతని నాయకత్వ సామర్థ్యాన్ని ఋజువు చేసింది. టీమ్‌లో నమ్మకాన్ని పెంచడం, ఆటగాళ్లను ప్రోత్సహించడం, అవసరమైన చోట రిస్క్ తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు శ్రేయస్‌కి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.

విజేత RCB రూ. 20 కోట్ల ప్రైజ్ మనీని అందుకోగా, రన్నరప్‌గా నిలిచిన పంజాబ్ కింగ్స్‌కు రూ. 12.50 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. అంతేకాకుండా, బలమైన పోరాట పటిమను గుర్తిస్తూ జట్టుకు ఒక ప్రత్యేక షీల్డ్ కూడా అందజేశారు. ఈ షీల్డ్ ఓటమిని సూచించదే కాదు, ఒక గొప్ప ప్రయాణాన్ని, అంకితభావాన్ని గుర్తించే గుర్తుగా నిలిచింది. ఈ ఓటమి తర్వాత కూడా అభిమానులు తమ జట్టుకు మద్దతుగా నిలవడం పంజాబ్ స్ఫూర్తికి నిదర్శనం. జట్టు యజమానురాలు ప్రీతి జింటా భావోద్వేగానికి లోనై ఉండగా, తక్కువ తేడాతో ఓడినా జట్టుపై నమ్మకంతో నిలిచారు. ఇంతవరకూ ట్రోఫీ అందుకోలేని పంజాబ్ జట్టు, ఈ సారి చేసిన ప్రయాణం మరిన్ని ఆశలను, కొత్త కోణాలను తెచ్చిపెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: