కరోనా వైరస్ కట్టడికి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. రెడ్జోన్ ఉన్న ప్రతి ప్రాంతంలో ప్రజలకు నేరుగా రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారు. ‘గడప దాటితే కరోనా.. గడప గడపకి కిరాణా’ అంటూ నజరానాను అందజేసేలా చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ సమయంలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తీర్చుతున్నారు. అంతేగాక క్వారంటైన్ సెంటర్లలో మెడికల్ ప్రొటోకాల్ పూర్తి చేసుకుని, తిరిగి ఇండ్లకు పంపేటప్పుడు పేదలకు కనీసం రూ.2000ల ఆర్థికసాయం అందించాలని కూడా ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
తాజాగా ఏపీ సీఎం జగన్ మరో కీలకం నిర్ణయం ప్రకటించారు. కరోనా దవాఖానల్లో పని చేసేందుకు తాత్కాలిక పద్దతిలో నర్సులు, ఎంఎన్వో, ఎఫ్ ఎస్ వో, స్వీపర్ల పోస్టుల భర్తీ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎంపికైన వారు ఏడాది పాటు పని చేయాల్సి ఉంటుంది. నర్సులకు క్రిటికల్ కేర్ యూనిట్లో రెండేళ్ల అనుభవం ఉండాలని, నియామకాల్లో రిజర్వేషన్ విధానం అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ ఎం, నర్సింగ్ కౌన్సిల్ లో నమోదు చేసుకున్న వారు అర్హులని ప్రభుత్వం వెల్లడించింది.