
టీడీపీ నేతలపై కక్ష సాధించేందుకు వైసీపీ చట్టాలు, రాజ్యాంగాన్ని సైతం విస్మరిస్తోందన్న విషయం దీని ద్వారా బహిర్గతమైందని నారా లోకేశ్ అంటున్నారు. ఎవరి ఫోన్నైనా ట్యాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఇష్టానుసారంగా తుంగలో తొక్కేందుకు ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చే ఫాసిస్టు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారుతోందని నారా లోకేశ్ విమర్శించారు. ప్రతిపక్షాలపై అసత్య ఆరోపణలు చేస్తూ తమ అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు వైసీపీ ఓవర్ టైమ్ పని చేస్తుండటం సిగ్గుచేటు అంటూ నారా లోకేశ్ మండిపడుతున్నారు.
అయితే.. అధికార పార్టీని ప్రతిపక్షం విమర్శించడం సహజమే అయినా.. మంత్రి పెద్ది రెడ్డి రికార్డెడ్గా నారాయణ ఫోన్ ట్యాప్ చేసినట్టు అంగీకరిస్తే మాత్రం అది పెద్ద విషయమే అవుతుంది. గతంలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఎంత పెద్ద దుమారం లేపిందో తెలిసిందే కదా. మరి ఈ విషయంలో టీడీపీ మరోసారి రచ్చ రచ్చ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై టీడీపీ నిప్పులు చెరిగింది.
మాజీ మంత్రి నారాయణ ను అరెస్ట్ చేశారు.. సరే..మరి బొత్స ను ఎందుకు అరెస్ట్ చేయలేదని టీడీపీ నేతలు ప్రశ్నించారు. సిఐడి పోలీసులు ఏసీబీ కేసు నమోదు చేశారన్న టీడీపీ నేతలు.. దానిలో ముద్దాయులుగా చంద్రబాబు నాయుడు, నారాయణను పెట్టారని గుర్తు చేశారు. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక రిపోర్ట్ ఇస్తే దాని పై వెంటనే ఫిర్యాదు తీసుకున్నారని అంటున్నారు. సీఆర్డీఏలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదని హైకోర్టు గతంలో చెప్పిన విషయం గుర్తులేదా అని నిలదీస్తున్నారు.