వైఎస్‌ భారతి.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్ సతీమణి. అంతే కాదు.. ఆమె తెలుగులో ప్రముఖ మీడియా హౌస్‌ సాక్షికి ఛైర్మన్‌ కూడా. అలాగే భారతి సిమెంట్స్‌ అధినేత కూడా. సీఎం భార్య అయినా ఆమె పెద్దగా మీడియా ముందుకు రారు. అయితే ఇటీవల కొంతకాలంగా ఆమెను కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు. ప్రత్యర్థులు తరచూ ఆమెను వివాదాల్లోకి లాగుతున్నారు. ఇక ఎన్నికల ముంచుకు వచ్చిన తరుణంలో ఆమె భర్త జగన్‌ తరపున ప్రచారం చేస్తున్నారు.


ఇటీవల జగన్‌కు ప్రత్యర్థిగా మారిన సొంత చెల్లెలు షర్మిల.. నేరుగా తన వదిన భారతిని టార్గెట్ చేశారు. జగన్‌ రిమోట్‌ బీజేపీ చేతిలోనూ.. ఇంట్లోని భారతి చేతిలోనూ ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. వివేకా హత్య కేసులో జగన్ అవినాష్‌ను కాపాడటానికి ప్రధాన కారణం భారతే అంటూ విమర్శలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆమె తాజాగా ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అనేక విషయాలు పంచుకున్నారు.


ఇంట్లో సీఎం జగన్‌ ఎలా ఉంటారు.. ఏం మాట్లాడతారు అనే విషయాలను పంచుకున్నారు. జగన్ ఇంట్లో పెద్దగా రాజకీయాలు మాట్లాడరని భారతి అంటున్నారు. ఇక ఇటీవల తనపై వస్తున్న విమర్శలను తాను పెద్దగా పట్టించుకోనని భారతి అన్నారు. ఐ డోన్ట్‌ కేర్‌ అన్న భారతి.. మనమేంటో మనకు తెలుసుకదా అది చాలని అన్నారు. మరి మీరు కూడా రాజకీయాల్లోకి వస్తారా అని అడిగితే.. తనకు రాజకీయాలు సరిపడవని.. రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యమే తనకు లేదని భారతి చెప్పుకొచ్చారు.


ఇక జగన్‌ గురించి చెబుతూ.. జగన్‌ ఎప్పుడూ ఏది కరెక్టో అది చేస్తూ వెళ్లారని.. ఎప్పటికప్పుడు లొంగిపోవడమా.. పోరాడటమా అనే ఛాయిస్‌ వచ్చినప్పుడు జగన్‌ ఎప్పుడూ పోరాటానికే ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. జగన్‌ దేవుడిని నమ్ముతాడని.. నమ్మినదాని కోసం పోరాడతాడని అన్నారు. ప్రజలకు మేలు చేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచిపోవాలన్నదే జగన్‌ కోరిక అని భారతి చెప్పారు. తన అధికారం ఉపయోగించి పేదలకు ఎంత చేయగలిగితే అంత చేయాలన్నదే జగన్ లక్ష్యమన్నారు. మళ్లీ బంపర్‌ మెజారిటీతో వైసీపీ గెలవబోతోందని.. గత ఎన్నికలను మించిన స్థాయిలో సీట్లు వస్తాయని భారతి దీమా వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: