సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కరోనా లాక్ డౌన్ తర్వాత స్టార్ హీరోలందరూ షూటింగ్‌లను మొదలు పెట్టేసినప్పటికి తమ అభిమాన హీరో ఇంకా కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదని మహేష్ బాబు అభిమానులు నిరాశ చెందారు. అయితే తాజాగా సర్కారు వారి పాట షూటింగ్ మొదలైందని చిత్ర యూనిట్ ఓ వీడియోను పోస్ట్ చేసింది. దీంతో మహేష్ బాబు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గతేడాది సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ బాబు నటించారు. ఆ తర్వాత ఈ సినిమాలోనే నటిస్తున్నారు.

గీత గోవిందం వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన పరశురామ్ సర్కారు వారి పాట చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండతో తీసిన సినిమా హిట్ కావడంతో మహేష్ బాబు పరశురామ్‌ను పిలిచి మరీ చాన్స్ ఇచ్చారు. దీంతో ఈ సినిమాతో టాప్ డైరెక్టర్ల జాబితాలోకి చేరాలని పరశురామ్ చూస్తున్నారు. బ్యాంకు కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ట్విటర్‌లో మహేష్ బాబు అభిమానులు సరికొత్త రికార్డును సృష్టించారు.

అదేంటంటే సర్కారు వారి పాట ట్యాగ్‌తో ట్విటర్‌లో ఇప్పటి వరకు వంద మిలియన్ ట్వీట్లు వచ్చాయట. కొత్త చిత్రాలకు సంబంధించి ట్విటర్‌లో అనేక ట్వీట్లు వస్తూనే ఉంటాయి. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏ చిత్రానికి కూడా ఇన్ని ట్వీట్లు రాలేదని, మహేష్ బాబు సినిమాకే ఇలా జరిగిందని చెబుతున్నారు. అది కూడా సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాక ముందే సాధించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఈ రికార్డు గురించే మాట్లాడుకుంటున్నారు. సర్కారు వారి పాట షూటింగ్‌ దుబాయిలో జరుగుతోంది. ఇప్పటికే మహేష్ బాబు, కీర్తి సురేష్ దుబాయికి చేరుకున్నారు. నెల రోజుల పాటు దుబాయిలోనే లాంగ్ షెడ్యూల్ జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: