ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక హోదా ఉద్యమం కొనసాగుతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరోలు తమకు ఏమీ పట్టనట్లు ఉంటున్నారని.. హీరోయిన్లతో డ్యాన్స్ లు చేస్తున్నారని..విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. కాగా తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు తర్వాత తెలిపారు. ప్రత్యేక హోదా ఉద్యమంపై సినీ తారలపై విమర్శించడంపై కమెడియన్ సంపూర్ణేష్ బాబు స్పందించారు.
ప్రత్యేక హోదా ఉద్యమంపై సినిమా వాళ్లకు బాధ్యత లేదా? అని ప్రశ్నించిన టీడీపీ నేత రాజేంద్ర ప్రసాద్కు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కౌంటర్ ఇచ్చాడు. శుక్రవారం తన ట్విట్టర్ ఖాతాలో తాను జైల్లో ఉన్న ఫొటోను పోస్ట్ చేసి.. టాలీవుడ్ చిత్తశుద్ధిని సంకించవద్దని స్పష్టం చేశాడు. ప్రత్యేక హోదా పార్టీలకు అతీతంగా పోరాడేందుకు తాను ఎప్పుడూ సిద్ధమేనని వెల్లడించాడు.
‘‘గత సంవత్సరం సోషల్ మీడియాలో యువత వైజాగ్లో మానవహారంగా ఏర్పడి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాలి అని పిలుపు ఇవ్వటం, అది ఉధృతమవటం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆనాడు నన్ను... నీకు బాధ్యత లేదా? నీ విజయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆదరణ లేదా అని ప్రశ్నించి, నా బాధ్యత గుర్తు చేశారు. మీరు తలపెట్టబోయే ఆ ఉద్యమానికి నేను వస్తాను అని మాట ఇచ్చాను’’ అని తెలిపాడు.
ఈ రోజు సినిమా వాళ్లకి బాధ్యత లేదా అని ప్రశ్నించిన గౌరవ రాజేంద్రప్రసాద్ గారికి నేను విన్నవించేంది ఏంటంటే.. ఆనాడు ఉద్యమానికి సంఘీభావంగా శ్రీ సాయి ధరమ్ తేజ్ గారు, సందీప్ కిషన్ గారు, నిఖిల్ గారు ఇలా ఎందరో యువ హీరోలు మద్దతుగా ట్వీట్లు వేశారు. ‘‘అంతర్జాతీయ సమ్మిట్ కారణంగా ఆ రోజు కాకుండా వేరొక రోజు మీ ఉద్యమాన్ని వాయిదా వేసుకోండని నాకు ఆలస్యంగా తెలిపారు. కానీ ఆ ఉద్యమానికి నాయకులంటూ లేరు.
యువతే నాయకత్వం వహించింది. మాట ఇచ్చి, సమ్మిట్ కారణంగా నేను రావడం లేదని చెప్పటం అన్యాయమవుతుంది. వస్తే అరెస్ట్ చేస్తారని తెలిసినా అక్కడికి వెళ్లాను’’. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ విషయంలో, ముఖ్యంగా స్పెషల్ స్టేటస్ విషయంలో మనకి జరుగుతున్న అన్యాయాన్ని తీవ్రంగా ఖండిస్తూ.. పార్టీలకి అతీతంగా ఎవరు పిలిచినా మీతో కలిసి పోరాడటానికి సిద్ధంగా ఉన్నాను. ఒక్క ఫోన్ కాల్తో అందుబాటులో ఉంటాను. సదా మీ ప్రేమకి బానిస- మీ సంపూర్ణేష్ బాబు’’ అంటూ ట్వీట్ చేశాడు.