వరుస ఫ్లాప్లతో తేరుకోలేకపోతున్న మాస్ హీరో గోపిచంద్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తగా ఉన్నాడు. కొత్త దర్శకుడితో భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా గోపిచంద్ హీరోగా తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్న ప్రాజెక్ట్ను ఉన్నపలంగా ఆపేశారు. స్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన గోపిచంద్ తొలి వలపు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమా ఫ్లాప్ అవడంతో హీరోగా ఛాన్స్లు రాక విలన్గా టర్న్ అయ్యాడు.
తేజ డైరెక్షన్స్ జయం, వర్షం, నిజం సినిమాల్లో విలన్గా నటించిన గోపిచంద్ మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే గోపిచంద్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలన్న కసితో పోకూరి బాబూరావు నిర్మాతగా యజ్ఞం సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఆ తరువాత కెరీర్లో రణం, లక్ష్యం, లౌక్యం లాంటి హిట్స్ వచ్చినా స్టార్ ఇమేజ్ అందుకునే స్థాయి మాత్రం పొందలేకపోయాడు.
దీంతో ఇప్పటికీ మార్కెట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఇక రీసెంట్గా తమిళ దర్శకుడు తిరు తెరకెక్కించిన
చాణక్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. స్పై థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్కు మరోసారి నిరాశనే మిగిల్చింది. అంతేకాదు డిజాస్టర్ గా మిగిలింది. ఇక
సైరా నరసింహారెడ్డి లాంటి భారీ సినిమాతో పోటి పడటం కూడా చాణక్యకు మైనస్ అయింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించగా కనీసం చెప్పుకోదగిన వసూళ్లు కూడా రాబట్టుకోలేకపోయింది.
దీంతో చాణక్య.. గోపిచంద్ కెరీర్లో మరో డిజాస్టర్గా నిలిచిపోయింది. అంతేకాదు ఈ సినిమా ప్రభావం గోపిచంద్ నెక్స్ట్ సినిమాల మీద గట్టిగా పడింది.
చాణక్య తరువాత భోగవల్లి ప్రసాద్ నిర్మాణంలో కొత్త దర్శకుడితో ఓ సినిమాను ప్రకటించాడు గోపి. మాస్ చిత్రాల దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలోనూ ఓ సినిమాను ప్రకటించాడు. అయితే ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కిన ప్రాజెక్ట్ను గోపిచంద్ పక్కన పెట్టేశాడు. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న ఉద్దేశంతో కథా కథనాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ మాస్ హీరో. గోపిచంద్ మలినేనితో చేయాలనుకున్న సినిమా కూడా భారీ బడ్జెట్ సినిమా కావటంతో ఆ ప్రాజెక్ట్ కూడా సెట్స్ పైకి వచ్చేలా కనిపించడం లేదు. మరి ఇలాంటి నేపథ్యంలో గోపి నెక్స్ట్ సినిమా ఎప్పుడుంటుందో, ఎవరితో ఉంటుందో క్లారిటి రావడం లేదు.